స్వాతంత్ర్య దినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష

స్వాతంత్ర్య దినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేశారు.

సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్వాతంత్ర్య దినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. బందోబస్తు ఏర్పాట్లను సమర్ధవంతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

సామాన్యప్రజానికానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని అని అన్నారు. గోల్కొండ కోటలో అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పించాలని ఆర్ అండ్ బి అధికారులను కోరారు. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని, మాస్క్ లు, శానిటైజర్ లను సరిపడాసంఖ్యలో అందుబాటులో ఉంచాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రతిభింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి కళాబృందాలను సమీకరించాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో టిఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, అడిషనల్ డిజి జితేందర్, కమీషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఎనర్జీ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Somesh Kumar
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News