నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగు నీరు విడుదల

Related image

కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి వర్షాకాలం సాగు కోసం నీటిని విడుదల చేశారు.

ఈసందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జులైలో సాగు నీటిని అందించడం గొప్ప విషయమని, కాళేశ్వరం ద్వారా 1.5టీఎంసీల నీరు నిజాంసాగర్ లో కలపడం వలన ఇది సాధ్యమైందని, అవసరమైతే ఇంకో రెండు టీఎంసీల నీటిని ముఖ్యమంత్రి ఇస్తారని, గోదావరి, మంజీరా జలాలు కలిపి నిజాంసాగర్ లో సాగునీటిని రైతులకు విడుదల చేయడం వల్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.

దేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి కోసం ప్రతినెలా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ మంజూరు చేసి గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాల వికాసానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జుక్కల్ శాసన సభ్యుల కోరిక మేరకు నిజాంసాగర్ మండలం హాసన్ పల్లి గ్రామానికి సీసీ రోడ్ల, డ్రైన్స్ నిర్మాణాలకు 20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు శాసనసభాపతి, మంత్రి హాసన్ పల్లి గ్రామంలో పల్లె ప్రగతి లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం గుల్ దస్తా గెస్ట్ హౌస్ ను పరిశీలించారు.

శాసన సభాపతి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను మనమిప్పుడు చూస్తున్నామని, రాష్ట్రంలో కోటి  50 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించి రైతులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిగా కట్టిన భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు అని, మంజీరా నదిపై కట్టిన నిజాంసాగర్ కు వర్షాలు లేక, పైన ఉన్న రాష్ట్రాల కారణంగా నిజాంసాగర్ నీటిని త్రృప్తికరంగా వాడుకోలేదని, దీనిని దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం లిఫ్ట్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు 1.5 టీఎంసీల నీటిని అందించడం జరిగిందని, దానితో కలిపి 7.4 టీఎంసీల నీరు నిజాంసాగర్ లో రిజర్వు చేయడం జరిగిందని, ఈ నీటిని విడుతల వారీగా లక్షా 30 వేల ఎకరాలకు వర్షాకాలం పంట కోసం సాగునీటిని అందించడానికి ముఖ్యమంత్రి ఆదేశించారని, ఇది మంచి సమయమని, అందుకే ఈరోజు నుండి నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు.

రైతాంగం నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని సూచించారు. జులై మాసంలో నీటిని వదలడం ఇదే మొదటిసారి అని, కరోనా సంక్షోభ సమయంలో కూడా ముఖ్యమంత్రి రైతులకు అండగా ఉండి 7500 కోట్లు పెట్టుబడి కింద రైతుబంధు అందించారని, ధాన్యం కొనుగోళ్ళు చేపట్టి రైతులను ఆర్థికంగా మనోబలం కలిగించినట్లు తెలిపారు.

కార్యక్రమాలలో పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ శోభా రాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, జుక్కల్ శాసన సభ్యుడు హనుమంత్ షిండే, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, నిజాంసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

More Press Releases