గ్రేటర్ హైదరాబాద్ లో అట్టహాసంగా పట్టణ ప్రగతి

Related image

హైదరాబాద్, జూలై 01: నగర పరిశుభ్రత, పచ్చదనం పెంపు ప్రధాన లక్ష్యాలుగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం జీహెచ్ఎంసీలో నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. నగరానికి చెందిన మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. ఖైరతాబాద్ నియోజక వర్గం దుర్గానగర్ కాలనిలో నిర్వహించిన పట్టణప్రగతిలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, కార్పొరేటర్ విజయా రెడ్డిలు పాల్గొని పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు కాలనీ పార్క్ లో నిర్వహించిన హరిత హారంలో పాల్గొన్నారు.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు స్థానిక కార్పొరేటర్ తో కలసి చిలకలగూడలోని ఇందిరా నగర్లో నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తనికీ చేశారు. మధురానగర్ లో చేపట్టిన నాలా పూడిక పనులను పరిశీలించారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీ పార్క్ లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్బంగా డెంగ్యూ నివారణ మాస చైతన్య కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య ఇతర అధికారులు హాజరయ్యారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి తార్నాక డివిజన్ లాలాపేట సత్య నగర్, సి,బి.ఎన్.నగర్ లలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించాలని ఆమె కోరారు. ఎల్.బి. నగర్ శాసన సభ్యుడు డి.సుధీర్ రెడ్డి హయత్ నగర్ లో, సర్కిల్ లోని కార్పొరేటర్లతో కలసి పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు.

యూసుఫ్ గూడలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గోషా మహల్ డివిజన్ లో పాల్గొనగా, నాంపల్లి ఎమ్మెల్యే బలాల నాంపల్లిలో పాల్గొన్నారు. అంబర్ పేట్ శాసన సభ్యుడు కాలేరు వెంకటేష్ కాచిగూడలో నిర్వహించిన ప్రగతి కార్యక్రమానికి హాజరుకాగా, కార్వాన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హాజరయ్యారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్ వార్డ్ పరిధిలో, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గాజుల రామారం సర్కిల్ లో స్థానిక కార్పొరేటర్ తో కలసి గాజుల రామారం సర్కిల్ లో పాల్గొన్నారు.

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానికంగా పాల్గొనగా, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎన్.ఐ.ఆర్.డి లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వీ.వీ నగర్ కాలనీలో పాల్గొన్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణ రావు కె.పి.హెచ్.బి 15ఫెస్ లో పాల్గొన్నారు.

More Press Releases