కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన తెలంగాణ స్పీకర్ పోచారం!

Related image

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆద్వర్యంలోని పార్లమెంట్, శాసనసభ్యుల బృందం ఈరోజు కేంద్ర రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి హైదరాబాద్ - భైంసా రహదారిపై వినతిపత్రం సమర్పించారు.

ఈరోజు న్యూఢిల్లీలో గడ్కరీని అధికారిక నివాసంలో కలిసిన స్పీకర్ పోచారం హైదరాబాద్ - నర్సాపూర్ - మెదక్ - ఎల్లారెడ్డి - బాన్సువాడ - రుద్రూర్ - బోధన్ - భైంసా (230 కిమీ) పరిధిలోని రాష్ట్ర రహదారిని కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించిందని తెలిపారు. ఈ రహదారిలో హైదరాబాద్ నుండి మెదక్ (64 కిమీ-NH 765 D), బోధన్ నుండి రుద్రూర్ (10 కిమీ- NH 161BB) వరకు ఇప్పటికే జాతీయ రహదారులుగా గుర్తించారు. మిగతా భాగంలోని మెదక్ - రుద్రూర్ (92 కిమీ), బోధన్ - బాసర - భైంసా (55 కిమీ) వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ఆమోదించి విస్తరణకు అనుమతి ఇవ్వాల్సిందిగా వినతిపత్రంలో స్పీకర్ పోచారం కోరారు.

ఈ నూతన రహదారి అనుసంధానంతో ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సులువుగా ఉండడంతో పాటు, ప్రసిద్ధ సరస్వతి దేవాలయం కొలువైన బాసరకు రవాణా మెరుగవుతుందని తెలిపారు. ఈ రహదారి విస్తరణలో ప్రాధమిక మౌళిక వసతులు మార్చడానికి అవసరమయ్యే నిధులలో 50 శాతం రాష్ట్ర వాటాగా భరించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించిన విషయాన్ని స్పీకర్ పోచారం గడ్కరీకి తెలియజేశారు.

స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంట ఎంపీలు నామా నాగేశ్వరరావు (ఖమ్మం), బీబీ పాటిల్ (జహీరాబాద్), శాసనసభ్యులు హనుమంత్ షిండే (జుక్కల్), జాజుల సురేందర్ ( ఎల్లారెడ్డి) ఉన్నారు.

More Press Releases