ప్రజా ఉద్యమాలతోనే ప్రత్యేక హోదా సాధ్యం: పవన్ కల్యాణ్

Related image

 

  • ప్రత్యేక హోదాకు కట్టుబడిన ఏకైక పార్టీ జనసేన 
  • ఏపీ, తెలంగాణాల మధ్య పరిష్కారం కావల్సిన అంశాలు ఉన్నాయి 
  • హైదరాబాద్ లో ఆస్తులు ఇవ్వడంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి 
  • ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ పేరిట అక్రమ క‌ట్టడాలు కూల్చడం మంచి ప‌రిణామ‌మే 
  • అక్రమ క‌ట్టడాల కూల్చివేతలో అందరికీ ఒకే నిబంధన వర్తింపచేయాలి 
  • విలేకర్ల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు 

ప్రజా ఉద్యమాలతోనే ప్రత్యేక హోదాను సాధించగలమని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. హోదా అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కని... ప్రజా ఉద్యమం మొద‌లైతే దానిని ముందుకు తీసుకెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్ర‌త్యేక హోదాపై అన్నిపార్టీలూ మాట‌ మార్చినా హోదా డిమాండ్ కు క‌ట్టుబ‌డి ఉన్న ఏకైక పార్టీ జ‌న‌సేన పార్టీ మాత్రమే అని తెలిపారు. హోదాపై మాటలు మారుస్తున్న నాయకులకి ప్రజలే ఎదురుతిరగాలి అన్నారు. సోమ‌వారం విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.
 ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “గెలుపోట‌ములు రాజ‌కీయాల్లో స‌హ‌జం. సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధమై జనసేన పార్టీని ఏర్పాటు చేశాను. న‌న్ను న‌మ్మి ఓట్లు వేసిన యువత ఆశ‌యాలు, ఆకాంక్ష‌లు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే నా ల‌క్ష్యం. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చాను కాబట్టే నైతిక బాధ్యతతో గట్టిగా ప్రశ్నించా. కొత్త రాష్ట్రం, కొత్త ప్ర‌భుత్వం, పాలసీలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కొంత సమయం తీసుకున్నాం. దాదాపు సంవత్సరం వరకూ ప్రశ్నించకుండా ఉన్నాను. అలాగే వైసీపీ ప్రభుత్వానికి కూడా తగినంత సమయం ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రజలకు సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ప్రవేశపెడితే కచ్చితంగా హర్షిస్తాం. అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏమి ఉన్నా ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్ర‌భుత్వం హైదరాబాద్ లోని ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఏ విధంగా ఇచ్చారో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు వివరణ ఇవ్వాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య సున్నితమైన, పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో అందరితో మాట్లాడి మా కార్యచరణ, ప్రణాళికను కొద్ది నెలల్లో ముందుకు తీసుకు వెళ్తాం. ప్రజా సమస్యలపై పోరాటానికి ఎప్పుడూ సిద్ధం. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ పేరిట అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చేయ‌డం మంచి ప‌రిణామ‌మే, అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చేయాలి లేక‌పోతే ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధిని శంకించాల్సి ఉంటుంది అన్నారు..
 జ‌న‌సైనికులు, ప్ర‌జ‌ల‌కు మాటిస్తున్నా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసేందుకు జ‌న‌సేన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఎన్నికలు పూర్తయ్యాక ఓటమితో అభద్రతాభావం వస్తుంది... భయాలుంటాయి. వాటిని తట్టుకోవాలి. ఫలితాలు వచ్చి ఒక నెల రోజులు కూడా గడవక ముందే పార్టీలు మారుతున్నారు... పరిస్థితులు ఏమిటో తెలియదుకానీ అది ఆయా పార్టీలవాళ్ళ ఇష్టం. సిద్ధాంత బలంతో ఉంటే ఆ భయాలు ఉండవు. మా పార్టీ నుంచి మారుతున్నట్లు నాకైతే సమాచారం లేదు. నాయకులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మాతో చర్చించవచ్చు. పార్టీలో చేరడం వేరు.. ఫిరాయింపులు వేరు. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. జమిలి ఎన్నికలు వస్తే సిద్ధమే. క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లోపేతం కావ‌డానికి ఇదే అనువైన స‌మ‌యం. ఇందుకోసం రాష్ట్ర‌స్థాయి క‌మిటీల‌ను వేస్తామ‌”ని తెలిపారు.

More Press Releases