తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీసెస్ కోచింగ్ 2019-20 బ్యాచ్ ప్రారంభం!

Related image

తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్లో జరిగిన సివిల్ సర్వీసెస్ కోచింగ్ 2019-20 బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డైరెక్టర్ కరుణాకర్ తదితరులు హాజరయ్యారు. 250 మందితో ప్రారంభం అయిన కొత్త బ్యాచ్ వచ్చే సంవత్సరం మే నెల ఆఖరి వరకు కొనసాగుతుంది. వీరికి ఉచిత బోధన, భోజనం, వసతి  కల్పించి వచ్చే సంవత్సరం మే నెల 31 న జరిగే ప్రిలిమినరీ పరీక్షకు తగిన తర్ఫీదు ప్రభుత్వం తరపున అందిస్తారు‌. మంచి పేరొందిన అధ్యాపక బృందంతో తర్పీదు ఇస్తారు.

మంత్రి మాట్లాడుతూ ఈ స్టడీ సర్కిల్ లో ఉన్న లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలనీ, చదువు పట్ల తగు శ్రద్ధ చూపి తాము అనుకున్న లక్ష్యం అయిన సివిల్ సర్వీసెస్ సాధించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఎర్రొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తాము తెలంగాణ పోరాటంలో భాగంగా ఈ స్టడీ సర్కిల్ అభివృద్ధికై కృషి చేశామని, చదువు అభివృద్ధి సాధ్యమవుతుంది అనడానికి తన జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పారు. అజయ్ మిశ్రా మాట్లాడుతూ ఇప్పుడు సాధించిన ఎస్ఐ పోస్టుల పట్ల సంతృప్తితో ఆగిపోకూడదనీ మరింత కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్ సాధించాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. కరుణాకర్ మాట్లాడుతూ ఈ స్టడీ సర్కిల్ లో కల సౌకర్యాలు ఇతర చోట్ల అలభ్యం అని మనసు పెట్టి చదివే విద్యార్థులు ఇక్కడ తమ లక్ష్యాన్ని సాధ్యం చేసుకోగలరనీ స్పష్టం చేశారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం కృషి చేసి కనీసం ఓ యాభై మందికి పైగా విద్యార్థులు ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయ్యే ప్రయత్నం చేస్తామని అంటే అతిథులందరు కనీసం నూటయాభై పైగా పాస్ అవ్వాలని అభిలషించారు.

తదుపరి ఎస్ఐ పోస్టులు సాధించిన ఇరవై మంది స్టడీ సర్కిల్ విద్యార్థులను శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. పిదప స్టడీ సర్కిల్ ఆవరణలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ మొక్కలు నాటారు.

More Press Releases