ముగ్గురు అథ్లెటిక్స్ క్రీడాకారులకు ఎలక్ట్రానిక్ స్కూటీలను అందించిన తెలంగాణ మంత్రి

Related image

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడా శాఖ ఆధ్వర్యంలో ప్రతిభ గల నిరుపేద కుటుంబాలకు చెందిన ఉత్తమ అథ్లెటిక్స్ అమ్మాయిలు J. దీప్తి, G. మహేశ్వరి, A. నందిని, ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ లకు ప్రోత్సాహంగా ఎలక్ట్రానిక్ స్కూటీ (4) లు మరియు ఒక్కొక్కరికి నగదు పురస్కారంగా 10 వేల రూపాయలను రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారులతో కలసి అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు చెందిన ముగ్గురు అథ్లెటిక్స్ క్రీడాకారులకు ఆర్థికంగా ప్రోత్సాహము అందించటానికి ముందుకు వచ్చిన రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చాముందేశ్వరినాధ్, సాయి కృష్ణా, బ్యాట్మింటన్ లో దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పుల్లెల గోపిచంద్ ను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గం లలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 50 స్టేడియం లను ప్రారంభించామన్నారు. మిగితా స్టేడియం లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. త్వరలోనే పూర్తి చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా క్రీడాకారులకు ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య అభ్యసించటానికి 0.5 శాతం రిజర్వేషన్లు ను అమలు చేస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్స్ లాంటి వేదికలపై మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని భారీగా పెంచామన్నారు.

ప్రతిభ కలిగిన గ్రామీణ, నిరుపేద క్రీడాకారుల ప్రతిభ ను వెలికితీసి  ప్రోత్సాహిస్తున్నామన్నారు. క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తున్నామన్నారు. క్రీడాకారులు దేశానికి వెన్నుముక లాంటి వారుగా మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. యువత క్రీడా స్పూర్తితో మెలిగి తమ జీవితాన్ని  మలుచుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ క్రీడా పాలసీ ని ప్రకటించారన్నారు. క్రీడా పాలసీ రూపకల్పన పై క్యాబినెట్ సబ్ కమిటీ ని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో క్రీడా అభివృద్ధి కి అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందించబోతున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి పారిశ్రామిక వేత్తలు తమ CSR ఫండ్స్ ను క్రీడల అభివృద్ధి కి, క్రీడాకారుల ప్రోత్సహించడానికి ఉపయోగించేందుకు ముందుకు రావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో షాద్ నగర్ శాసన సభ్యులు అంజయ్య,  స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, ప్రముఖ బ్యాట్మింటన్ మాజీ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్, బ్యాట్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముందేశ్వరి నాధ్, MLR మోటార్స్ డైరెక్టర్. సాయి కృష్ణ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేష్, ఒలింపియన్ శోభ మరియు క్రీడాకారులు, కోచ్ లు, SATS ఉన్నతాధికారులు సుజాత, V. వెంకయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. 

More Press Releases