కరోనా మార్గదర్శకాలకు లోబడే చవితి వేడుకలు: ఏపీ గవర్నర్

కరోనా మార్గదర్శకాలకు లోబడే చవితి వేడుకలు: ఏపీ గవర్నర్
  • రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిన బిశ్వ భూషణ్ హరి చందన్
  • రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
  • కరోనా నుండి విశ్వ జనావళిని కాపాడాలని గణనాథుని ప్రార్థిస్తున్నా
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఈ ముఖ్యమైన పండుగను హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారని, మరోవైపు యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొనటం ప్రత్యేకమని గవర్నర్ పేర్కొన్నారు.

భక్తులు తమ ఆకాంక్షలకు అనుగుణంగా చేసే ప్రయత్నాలను సఫలం చేసుకునే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించాలని విఘ్నేశ్వరుడిని పూజిస్తారని బిశ్వ భూషణ్ హరిచందన్ వివరించారు. ఈ పర్వదినాన ప్రజలు తమ భవిష్యత్తు కార్యక్రమాల విజయవంతాన్ని ఆకాంక్షిస్తూ గణేశుడికి ప్రార్థనలు చేయడం ఆచారంగా వస్తుందని గవర్నర్  తెలిపారు.

కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితులను అధిగమించి, శాంతి, సామరస్యంతో జీవితాన్ని గడపడానికి అవసరమైన శక్తిని విశ్వ జనావళికి ప్రసాదించాలని తాను విగ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అధికారులు జారీ చేసిన కోవిడ్ -19 మార్గదర్శకాలు, ఆరోగ్య ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని, ఇంట్లో వద్దే ఉండి పండుగను జరుపుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించటంలో అధికార యంత్రాంగానికి సహకరించడం ద్వారా దానికి వ్యతిరేకంగా సాగే యుద్దంలో భాగస్వాములు కావాలని హరిచందన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ప్రకటన వెలువడింది.
Biswabhusan Harichandan

More Press News