ఆగస్టు 5 వ తేదీ నుండి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం: మంత్రి తలసాని

Related image

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,  సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 5 వ తేదీన సిద్ధిపేట జిల్లాలోని కొండ పోచమ్మ, రంగనాయక సాగర్ రిజర్వాయర్ లలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు.

పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, TSLDA CEO మంజువాణి, విజయ డైరీ MD శ్రీనివాస్ రావు, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, మత్స్య శాఖ JD శంకర్ రాథోడ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సమావేశంలో పాల్గొన్న నేషనల్ ఇన్సురెన్స్ CRM వెంకట్రావ్, DVM గీతాంజలి లతో పెండింగ్ ఇన్సురెన్స్ లపై చర్చించి వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సకాలంలో ఇన్సురెన్స్ చెల్లించక పోవడం వలన  రైతులు నష్టపోతారని, జాప్యం జరగకుండా చూడాలని, లేదంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలను పరిశీలిస్తుందని అన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తన మానసపుత్రిక అయిన  ఉచిత చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, పాడి గేదెల పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని వివరించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి KCR కే దక్కుతుందని అన్నారు.

రాష్ట్రంలోని 24 వేల చెరువులు, రిజర్వాయర్లలో 50 కోట్ల రూపాయల ఖర్చుతో 81 కోట్ల చేప పిల్లలను, 78 నీటి వనరులలో 10 కోట్ల రూపాయల ఖర్చుతో 5 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను విడుదల చేయనున్నట్లు విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. కరోనా నేపద్యంతో చేపపిల్లల విడుదల చేసే సమయంలో 25 మంది సభ్యులకు మించి లేకుండా చూడటం, మాస్క్ లు తప్పని సరిగా ధరించడం వంటి జాగ్రత్తలు పాటించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద ఎంతో పెరిగిందని మంత్రి తెలిపారు.

మత్స్యకారులకు సబ్సిడీ పై వాహనాలు, వలలు, కేట్స్ వంటివి అందిచడం జరిగిందని, ముఖ్యమంత్రి చొరవతో రాష్ట్రంలోని మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. చేపలను ఎగుమతి చేసేస్థాయి కి రాష్ట్రం అభివృద్ధి సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. GHMC పరిధిలోని 150 డివిజన్ లకు డివిజన్ కు ఒకటి చొప్పున 150 సంచార చేపల విక్రయ కేంద్రాలను సబ్సిడీ పై అందజేయనున్నట్లు తెలిపారు. చేపలు, వివిధ రకాల చేపల వంటకాలను విక్రయించేలా ఈ వాహనాలను రూపొందించినట్లు వివరించారు.

2 వ విడత పాడి గేదెలు, గొర్రెల పంపిణీ ని త్వరలో చేపట్టనున్నట్లు ప్రకటించారు. జీవాల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటుందని, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాక్సినేషన్ వంటి కార్యక్రమాలను సకాలంలో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు, పాడి గేదెలు మరణిస్తే ఇన్సురెన్స్ ద్వారా జీవానికి బదులు జీవాన్ని కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఇన్సురెన్స్ చెల్లింపులను నెల రోజులలలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా 1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గ్రామాలలోని జీవాలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 2 వేల పశువైద్యశాలలో వైద్య పరికరాలు, మందులు, మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. VBRI ద్వారా త్వరలో మరికొన్ని వ్యాక్సిన్ లను తయారీ చేసేలా కార్యాచరణ ను రూపొందిస్తున్నమని అన్నారు. మెగా డైరీ నిర్మాణ పనులను మామిదిపల్లిలో త్వరలోనే చేపట్టనున్నట్లు చెప్పారు.

విజయ డైరీ ఉత్పత్తులకు ఎంతో ప్రజాదరణ ఉందని, వాటిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, హైవే ల వెంట పెద్ద ఎత్తున ఔట్ లెట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నష్టాలలోకి నెట్టివేయబడిన విజయ డైరీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో లాభాల బాటలో పయనిస్తుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. మేలుజాతి పశుసంపద అభివృద్ధి కోసం చేపట్టిన కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానం లో ఉందని, ఇది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అన్నారు.

ఆగస్టు 1 నుండి మే 2021 వరకు కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్ లోని కేంద్రం మాత్రమే పశువీర్య ఉత్పత్తి జరుగుతుందని, త్వరలోనే కంసానిపల్లి లోని కేంద్రం సేవలు కూడా ప్రారంభం కానున్నాయని అన్నారు. వేసవి లో పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పశుసంవర్ధక శాఖ  ఆధ్వర్యంలో పశుగ్రాసం పెంపకాన్ని చేపడుతున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్  చెప్పారు. 

More Press Releases