డిస్కంలకు ఇచ్చే అప్పులో ఒక శాతం తగ్గించాలి: తెలంగాణ మంత్రి డిమాండ్

Related image

  • 9.5% వడ్డీతో డిస్కం లకు అప్పు ఇస్తామన్న కేంద్రం దానిని 8.5%వడ్డీకి తగ్గించాలి
  • రాష్ట్రాల హక్కులను హరించడమే
  • సబ్సిడీలకు ఆటంకం కలిగించిందుకే
  • అత్యవసర సర్వీస్ ను ప్రయివేట్ పరం చేసేందుకే 
  • విద్యుత్ ముసాయిదా బిల్లు 2020 పై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్: విద్యుత్ చట్ట సవరణ అంటేనే రాష్ట్రాల హక్కులను హరించి వేయడమేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. అత్యవసర సర్వీస్ ను ప్రయివేటు పరం చేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. కోవిడ్ తో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు ఇచ్చే రుణాల మీద ఒక శాతం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. 9.5%తో కాకుండా ఒక శాతం తగ్గించి 8.5% వడ్డీకే రుణాలు ఇవ్వాలని ఆయన కేంద్రానికి సూచించారు.

విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా పై జాతీయ స్థాయిలో కేంద్ర విద్యుత్ శాఖమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ సౌదా నుండి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ప్రధానంగా కేంద్రం డిస్కం లకు ఇచ్చే రుణాల పై వడ్డీ తగ్గించాలని ప్రతిపాదించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే విద్యుత్ చట్ట సవరణ చట్టం తెలంగాణ రైతాంగానికి గొడ్డలి పెట్టు లాంటిదని అభివర్ణించారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా పై కేంద్రానికి స్పష్టంగా లేఖ రాసిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ బిల్లు వల్ల వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం చేకూరక పోగా గృహ వినియోగదారులు సబ్సిడీ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సబ్సిడీ పొందుతున్న అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకునే ఈ బిల్లు ను వ్యతిరేకిస్తూన్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

దేశంలోని మిగితా రాష్ట్రాలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూన్నా బిల్లులో సింగిల్ లైన్ కూడా మార్పుకు నోచుకోక పోవడం దురదృష్టకరమన్నారు. పంజాబ్ ,రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలు సైతం బిల్లును వ్యతిరేకిస్తున్న అంశాన్ని ఆయన ఉటంకించారు. విద్యుత్ రంగంపై రాష్ట్రాల హక్కులను కేంద్రం ఈ బిల్లు ద్వారా ఆధీనంలోకి తీసుకొని ప్రయివేట్ పెట్టుబడి దారుల చేతుల్లో పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రాలు అభ్యంతరం పెట్టిన అంశాలలో ఇఆర్సీ నియామక నిబంధనలలో మార్పులు చేశామని చెప్పారు కానీ అది చేతలలో జరగలేదన్నారు. అదే విదంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండో యూనిట్ 270 మేఘవాట్లు అనుసంధానించామని ఆయన ప్రకటించారు. ఈ రోజు నుండి అక్కడ ఉత్పత్తి ప్రారంభమైనట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

దురదృష్టవశాత్తు కొందరు న్యాయస్థానలలో కేసులు వెయ్యడంతో కొంత ఆలస్యమైందన్నారు. మూడో యూనిట్ ను కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. భద్రాద్రి లో పూర్తి స్థాయిలో అంటే 1080 మేఘావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించ బోతున్నట్లు ఆయన చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి వెంట రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా,ట్రాన్స్కో&జెన్కో సి యం డి ప్రభాకర్ రావు,టి యస్ యస్ పి డి సి యల్ సి యమ్ డి రఘుమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases