జూన్ 8 నుంచి భక్తులకు ద‌ర్శ‌నాలు: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి

Related image

  • ఆల‌యాల‌ను తరచుగా శానిటైజ్‌ చెయ్యాలి
  • భక్తులు తగిన దూరం పాటించేలా చూడాలి
  • కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించే ఏర్పాట్లు ఉండాలి
  • కంటైన్‌మెంట్ జోన్లో ఉన్న ఆల‌యాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలు ఉండ‌వు
  • దేవాదాయ శాఖ స‌మీక్ష స‌మావేశంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
హైద‌రాబాద్, జూన్ 5: కేంద్ర‌, రాష్ట్ర  ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి తెలంగాణ‌లోని ఆలయాల్లోకి భక్తుల రాకను పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. భక్తుల ద‌ర్శ‌నాల‌కు ఆలయాలు తెరిచే విషయమై శుక్ర‌వారం అర‌ణ్య భ‌వ‌న్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మీక్షించారు.

దేవాలయాల పునః ప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్‌ఓ‌పి)ను అధికారులతో చర్చించారు. భక్తులకు తగిన భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్ల ఏర్పాటు, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో ఆలయం శుభ్ర పర చడం, ప్రవేశ ద్వారం దగ్గర శానిటైజర్‌లు అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర‌ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుంచి ఆలయ తలుపులు తెర‌వ‌నున్నామని, అయితే కంటైన్మెంట్ జోన్లో ఉన్న ఆల‌యాల్లోకి భ‌క్తుల‌కు ప్ర‌వేశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆల‌యానికి వ‌చ్చే భక్తులు భౌతిక‌ దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని అన్నారు.

ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు ధర్మల్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శానిటైజర్లతో ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయని చెప్పారు. అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చూస్తామన్నారు. పుష్క‌రిణిలో స్నానాల‌కు అనుమ‌తి లేద‌న్నారు. అంత‌రాల‌య ద‌ర్శ‌నం, శ‌ఠ‌గోపం, తీర్థ ప్ర‌సాదాల విత‌ర‌ణ, వ‌స‌తి సౌక‌ర్యాలు ఉండ‌వ‌‌న్నారు. ఆల‌యాల వ‌ద్ద ఉన్న విక్ర‌య కేంద్రాల ద్వారా ‌ప్ర‌సాదాలు పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు. ప్రముఖ దేవాలయాలకు సంబంధించి ఆన్ లైన్ బుకింగ్ సేవ‌లు య‌ధావిధిగా అందుబాటులో ఉంటాయ‌న్నారు.

కంటైన్‌మెంట్ జోన్లో ఉన్న ఆల‌యాల్లో భ‌క్తుల ద‌ర్శనాల‌కు అనుమ‌తి లేద‌ని, అదేవిధంగా కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. 65 ఏండ్ల‌పైబ‌డిన వారు, 10 ఏండ్ల లోపు పిల్ల‌లు, క‌రోనా వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు ఆల‌య ద‌ర్శ‌నాల‌కు రావ‌ద్ద‌ని సూచించారు. ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

More Press Releases