నాయకత్వ సామర్థ్యం, బాధ్యతాయుత దృక్పథం ఉన్నవారికే కమిటీల్లో స్థానం: జనసేన

Related image

  • జనసేన విధివిధానాలకు... సిద్ధాంతాలకు బద్ధులై క్షేత్రస్థాయితో మమేకం కావాలి 
  • భావి తరాల ప్రయోజనాలకీ... యువత రాజకీయ చైతన్యానికీ ప్రాధాన్యం
  • జనసేన పోలిట్ బ్యూరోలో నాదెండ్ల మనోహర్, పి.రామ్మోహన్ రావు, రాజు రవితేజ్, అర్హంఖాన్
  • 11 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ... కమిటీ ఛైర్మన్ గా నాదెండ్ల మనోహర్
  • క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా మాదాసు గంగాధరం 
  • సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన యువ అభ్యర్థులతో ప్రత్యేక కమిటీ 
  • కీలక నిర్ణయాలు తీసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 
జనసేన పార్టీని సామాజిక ప్రయోజనంతో దీర్ఘకాలిక లక్ష్యంతో భావి తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ప్రారంభించాం... పార్టీ సిద్ధాంతాలను విశ్వసించి, నాయకత్వ సామర్థ్యం, బాధ్యతాయుత దృక్పథం ఉన్నవారిని పార్టీ కమిటీల్లోకి తీసుకున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీలో ఉండే నాయకులు వ్యక్తిగత అజెండాలు పక్కనపెట్టి... పార్టీ అజెండాతోనే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. జనసేన విధివిధానాలకు, సిద్ధాంతాలకు బద్ధులై ఉండాలని ఆదేశించారు. పార్టీతోపాటే మనమూ ముందుకు వెళ్లాలనుకోవడం తప్పు కాదు... కానీ పార్టీ సిద్ధాంతాలతోనూ, శ్రేణులతోనూ మమేకం కాకుండా వెళ్ళే ధోరణి వదులుకోవాలన్నారు. ఎన్నో ఒత్తిళ్ళు, కష్టానష్టాలు ఉంటాయి... వాటిని తట్టుకోగలిగే తెగువ ఉన్న నాయకులతో ముందుకు వెళ్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

జనసేన పార్టీకి సంబంధించిన కీలక కమిటీలకు పవన్ కల్యాణ్ రూపునిచ్చారు. పోలిట్ బ్యూరోలో నలుగురు సభ్యులు ఉంటారు. పోలిట్ బ్యూరోలో నాదెండ్ల మనోహర్, పి.రామ్మోహన్ రావు, రాజు రవితేజ్, అర్హంఖాన్ ను సభ్యులుగా నియమిస్తూ పవన్ కల్యాణ్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తొలి విడతగా 11 మంది సభ్యులను నియమించారు. పార్టీ అవసరాలకు అనుగుణంగా ఈ కమిటీ పరిధిని పెంచుతారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి నాదెండ్ల మనోహర్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి తోట చంద్రశేఖర్ పార్టీ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా మాదాసు గంగాధరంని నియమిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన యువ అభ్యర్థులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దే క్రమంలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది.

  • సాధికారత... సహనశీలత 
జనసేన పార్టీ గమనానికి పోలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీలు కీలకం. శ్రేణులకు దిశానిర్దేశం చేయగలిగే సమర్థ నాయకత్వపటిమ, రాజకీయ, సామాజిక, పాలన వ్యవహారాలపై ఉన్న సాధికారత, ప్రజా సమస్యలను కూలంకషంగా పరిశీలించే ఆలోచన, బాధ్యతాయుత దృక్పథం ఉన్నవారికే ఈ కమిటీల్లో స్థానం కల్పిస్తారు. శ్రేణులతో మమేకం కావడంలో సహనశీలత కలిగినవారికీ ప్రాధాన్యం ఇస్తారు.

జనసేన పార్టీ ఆలోచన దృక్పథానికి అనుగుణంగా... పార్టీ సిద్ధాంతాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటిని బలంగా క్షేత్రస్థాయి వరకూ తీసుకువెళ్లే సమర్థత ఉన్నవారిని పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎంపిక చేశారు. వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో పార్టీ వ్యూహాలను ప్రభావశీలంగా అన్ని స్థాయిల్లో అమలు చేయగలిగేవారికి ఇందులో స్థానమిచ్చారు.

రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు ప్రాంతాల్లో సున్నితమైన భావోద్వేగాలు రగిలిన సమయంలో చట్టసభను సమర్థంగా నిర్వహించి జాతీయ స్థాయిలో మన్ననలు పొందిన సభా నాయకుడు నాదెండ్ల మనోహర్ జాతీయ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకూ రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన... సంబంధిత వర్గాలతో పరిచయాలు మనోహర్ కి ఉన్నాయి. చట్టాలు, పాలన అంశాలపై పట్టు ఉన్న ఆయన జనసేనలో అధికారికంగా చేరేందుకు రెండేళ్ల ముందు నుంచే జనసేనాని పవన్ కల్యాణ్ తో పలు చర్చలు చేశారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆలోచన విధానంపట్ల పూర్తి విశ్వాసం ఉన్నవారాయన. పార్టీలో చేరినప్పుడు ఎలాంటి పదవి కోరుకోలేదు. ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ పార్టీతోనే నడుస్తానని తొలి రోజునే మనోహర్ పార్టీ అధ్యక్షులకు చెప్పారు.

తమిళనాడు ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన పి.రామ్మోహన్ రావు ఏ అంశాన్నైనా 360 డిగ్రీల్లో విశ్లేషించగలరు. సామాజిక, రాజకీయ, పాలన అంశాలపై వారి సాధికారత పార్టీ నిర్వహణకు ఇతోధికంగా ఉపయోగపడుతుంది. సాంఘిక సంక్షేమ, రైతు ప్రయోజనాలపై స్పష్టమైన దృక్పథం ఉంది. పార్టీ నిర్మాణ, నిర్వహణకు వారి ఆలోచనలు అవసరమవుతాయి. జనసేన పార్టీలో లోకల్ బాడీ ఎలెక్షన్స్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్నారు.

జనగాం పట్టణానికి చెందిన రాజు రవితేజ్ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై సాధికారత కలిగినవారు. అభ్యుదయ భావాలు కలిగిన వీరు పొలిటికల్, ఫిలాసఫీ, కల్చర్ అంశాలపై 23 దేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. సాధారణ ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన వీరికి అంతర్జాతీయంగా దౌత్య సంబంధిత పరిచయాలున్నాయి. రవితేజ్ తండ్రి బచ్చల జోసెఫ్ డేవిడ్ జనగాంలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. రవితేజ్ ప్రజారాజ్యం పార్టీలోని యువరాజ్యం విభాగానికి ఉపాధ్యక్షులుగా పని చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో గత 12ఏళ్ల నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. పవన్ కల్యాణ్ తో పోలెండ్ రాయబారి భేటీకి కీలక భూమిక పోషించింది రాజు రవితేజ్.

ప్రజారాజ్యం పార్టీ సమయం నుంచి రాజకీయ పార్టీ నిర్వహణతో సంబంధం ఉన్నవారు అర్హం ఖాన్. విద్యావంతులైన వీరికి మైనార్టీల సమస్యలు, సామాజిక సమస్యలపై పట్టు ఉంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంలో అభ్యర్థుల ఎంపికలో ముఖ్య బాధ్యత నిర్వర్తించారు. జనసేన పార్టీలో మైనార్టీ విభాగానికి బాధ్యులుగా ఉన్నారు.

  • పకడ్బందీ ప్రణాళికతో
జనసేన పార్టీ నిర్వహణ, పార్టీ విధానాలను ప్రజల్లోకి చేర్చే క్రమంలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పార్టీతో ఉంటూ ఎన్నికల వేళ, ఇతర సందర్భాల్లో - ఇతర పార్టీల ప్రలోభాలకీ, ధన ప్రభావానికీ ప్రభావితమై పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నవారిపై జనసేన శ్రేణుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఇతర పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తున్న నాయకుల వ్యవహార శైలినీ జనసేనాని దృష్టికి కార్యకర్తలు తీసుకువచ్చారు. ఇలాంటివారికి కమిటీల్లో స్థానం కల్పించవద్దని కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీల్లో కొందరు తమ బాధ్యతలు నిర్వర్తించకుండా, పార్టీకి నష్టం కలిగించినవారిని గుర్తించారు. కమిటీల ఏర్పాటు విషయంలో అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్లారు. అలాగే పార్టీ సిద్ధాంతాలతో మమేకం కాకుండా... నాయకత్వపరంగా ఎలాంటి తెగువ చూపించకుండా, తమ వ్యక్తిగత అజెండాను పార్టీపై రుద్దాలనే నాయకుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించారు.

  • అంచలంచెలుగా... బలమైన ప్రమాణాలతో పార్టీ కమిటీల ఏర్పాటు
నిర్దేశిత ప్రమాణాల మేరకు పార్టీ కమిటీల రూపకల్పన చేస్తున్నారు.  వందేళ్ల పైబడిన చరిత్ర ఉన్న జాతీయ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోల్పోయింది... బలంగా ఉన్న మరో జాతీయ పార్టీ కూడా రాష్ట్రంలో స్వల్ప శాతం ఓట్లకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన పార్టీ నాయకుడికి తండ్రి వారసత్వం, ఆయన వచ్చిన జాతీయ పార్టీ తాలూకు క్యాడర్, ఇతర వనరులు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి దశాబ్దాల అనుభవంతో ఒక నిర్మాణం ఉంది. తెలంగాణలో దశాబ్దంన్నరగా బలమైన రాజకీయం నెరపుతున్న పార్టీకి జిల్లా స్థాయిలో నిర్మాణం, శాశ్వత భవనాలు ఏర్పరచుకొనేందుకు అవసరమైన సమయం ఇప్పుడు వచ్చింది. ఇవేవీ లేకుండా- రాజకీయంగా దెబ్బ తిన్న పార్టీ నుంచి వచ్చి, సిద్ధాంత బలంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రబలంగా నిలవడం చిన్న పరిణామం కాదు. ఈ రాజకీయ ప్రభావాన్ని సమర్థంగా ఉపయోగించుకొంటూ, బలమైన  వ్యవస్థాగత నిర్మాణంతో ముందుకు వెళ్తుంది జనసేన. పార్టీ నిర్వహణ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన ప్రతి కమిటీని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే ప్రకటించాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

పవన్ కల్యాణ్ కమిటీల నియామకంపై మాట్లాడుతూ “పార్టీ నిర్మాణం అనేది ఒకే రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ఒక పరిశ్రమ విజయవంతంగా నడవాలంటే ఒక్కసారిగా అన్నీ అయిపోవు... సమర్థులను అన్వేషించి నిర్మించుకోవాల్సిందే. అదే రీతిలో సమర్థులు, బాధ్యతాయుతమైన ఆలోచన కలిగిన యువకులు, అనుభవజ్ఞులైన నాయకులతో దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనంతో పార్టీని నిర్మించాలి. నాపై అమితమైన విశ్వాసం ఉన్న అభిమాన గణం ఉంది... పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఆలోచనలపై విద్యావంతులు, తటస్తుల్లో నమ్మకం ఉంది. వీరిని పార్టీకి అనుసంధానించి ఒక బలంగా మార్చే శక్తి ఉన్న నాయకులు అవసరం. ఆ స్థాయి నాయకులను జనసేన ఎప్పుడూ స్వాగతిస్తుంది. ఇలా అనుసంధానించే బాధ్యత ఆ నాయకులు తీసుకోవాలి. అధ్యక్షుడిగా ఒక మాట చెబితే క్షేత్ర స్థాయి వరకూ ఆ ప్రభావాన్ని తీసుకువెళ్ళాలి. ఒక సమస్య మీద మాట్లాడితే దాన్ని పరిష్కరించే దిశగా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత అజెండాలు వదిలి... పార్టీ దృక్పథాన్నే తన పథంగా భావించేవారితోనే కమిటీలు ఉంటాయి. వ్యక్తిగత అజెండాలను జనసేన పార్టీ మోయదు. జనసేన పార్టీకి ప్రజా ప్రయోజనమే పరమావధి.

  • పార్టీ నిర్మాణంలో భాగస్వాములకే గుర్తింపు... యువ నాయకులకు ప్రోత్సాహం 
స్వల్పకాలిక ప్రయోజనాలు... తక్షణ ఫలితాలు, పదవులు ఆశించడం సహజం. అయితే పార్టీ నిర్మాణంలో భాగస్వాములై, పార్టీతో దీర్ఘకాలిక అనుబంధం కొనసాగించేందుకు బద్ధులైన నాయకులకు ప్రథమ ప్రాధాన్యం, గుర్తింపు లభిస్తుంది. పార్టీ నిర్మాణ క్రమంలో, రాజకీయ ప్రయాణంలో ఎదురు దెబ్బలు ఉంటాయి... ఒత్తిళ్ళు ఉంటాయి. వాటిని తట్టుకొని, శ్రేణులకు అండగా నిలిచే మనో నిబ్బరం ఉండాలి. ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుటి పక్షాలు, అధికార పక్షాలు కల్పించినా ఎదురు తిరిగే తెగువ కావాలి. అవేవీ లేకుండా జాగ్రత్తగా, ఆత్మరక్షణతో రాజకీయాలు చేయడం సాధ్యం కాదు. గెలుపోఓటమో.... యుద్ధం అంటే యుద్దమే చేయాలి. ఆ తెగువే ఈ వర్తమాన రాజకీయాల్లో చూపాలి.

 జనసేన పార్టీ ప్రారంభమైన నాటి నుంచి కలిసి నడిచినవారికి పార్టీ భావజాలం అర్థమవుతుంది. క్షేత్ర స్థాయిలోను, ఎక్కడెక్కడో ప్రవాసంలో ఉన్న తటస్తులకు పార్టీ భావజాలం దాని ప్రయోజనం అర్థమైంది. అయిదేళ్ళ నుంచి కాకుండా ఎన్నికలకు అయిదు వారాల ముందు వచ్చినవారికి పార్టీ సిద్ధాంతాలు, దృక్పథం అవగతం కాకపోవచ్చు. అలాంటివారు పార్టీని అధ్యయనం చేసి శ్రేణులతో మమేకం కావడం తప్పనిసరి. కులాన్ని కచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే మన సమాజం భిన్న కులాల సమాహారం. అలాగని కుల ప్రాతిపదికన పార్టీని నడపటం సాధ్యం కాదు.

జనసేన పార్టీ భావి తరాల ప్రయోజనం కోసం, నవతరం రాజకీయ నాయకత్వాన్ని తీర్చిదిద్దే క్రమంలో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో విస్తృత రాజకీయ ప్రయోజనాలతోనే పార్టీ నిర్వహణ ఉంటుంది. నేను ఏం చెబుతానో అదే ఆచరిస్తాను. నేను నా వ్యక్తిగత ప్రయోజనం అనేది చూసుకోలేదు.. చూసుకోను. అత్యధిక పారితోషికం తీసుకొనే కథానాయకుడిగా... స్టార్ డమ్ ఉన్న సమయంలోనే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రజా క్షేత్రంలోకి వచ్చాను. అమిత్ షా గారిని కలిసినా, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా అక్కడ నా వ్యక్తిగత అజెండా ఏదీ వారి ముందు ఉంచలేదు. పార్టీని, నన్ను విశ్వసించిన ప్రజల కోసమే పని చేస్తాను. ఈ ధోరణి కొందరికి రుచించకపోవచ్చు... వారికి ఇన్ స్టెంట్ రిజల్ట్, పదవులు అవసరం కావచ్చు. అలాంటివారితో పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. జనసేన ఎంచుకున్న పంథా కఠినంగానే ఉంటుంది. నిర్దుష్ట లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. అందుకు తగ్గ విధంగా నడిచే నాయకులతోనే జనసేన పరిపుష్టం అవుతుంది” అన్నారు.

  • క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళిక రూపకల్పన  
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. యువతను, అనుభవజ్ఞులైన నాయకులను కలుపుకొని ఈ పర్యటనలు చేపడతారు. క్షేత్ర స్థాయిలో సమస్యలను గుర్తించి వాటిని పరిశీలించడంతోపాటు ఏ విధమైన పంథాలో పరిష్కరించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి అనే దిశగా పవన్ కల్యాణ్ ఈ పర్యటనలు చేపడతారు. ఈ పర్యటన ద్వారా పార్టీలో యువ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతోపాటు, వారిని సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో ఉత్తేజితం చేసి దిశానిర్దేశం చేస్తారు. ఇందుకు అవసరమైన మార్గనిర్దేశనం చేసేలా అనుభవజ్ఞులైనవారిని ఈ పర్యటనల్లో భాగస్వాముల్ని చేస్తారు.
 
జనసేన కమిటీలకు నిర్దేశించిన బాధ్యతలను ఎప్పటికప్పుడు సమీక్షించడంతోపాటు, క్షేత్ర స్థాయిలో ఆ కమిటీల ప్రభావం, పని తీరును పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలన చేస్తారు. జనసేన పార్టీ పక్షాన తీసుకురానున్న మ్యాగజైన్ కు సంబంధించిన పనులు చురుగ్గా నడుస్తున్నాయి. సామాజిక, రాజకీయ పత్రికగా ఇది రూపుదిద్దుకుంటుంది.

More Press Releases