ప్రజా ఆస్తులు అమ్ముకోవడం అంటే పాలన వైఫల్యమే: పవన్ కల్యాణ్

Related image

• సంపద సృష్టించాలి అంటే పెట్టుబడులు తీసుకురావాలి... ఆస్తులు అమ్ముకోకూడదు
• గుంటూరు నగరంలో ల్యాండ్ మార్క్ లాంటి పి.వి.కె.నాయుడు మార్కెట్ ను వేలానికి పెట్టడం సరికాదు
• పి.వి.కె.నాయుడు మార్కెట్ తో గుంటూరు ప్రజలకే కాదు జిల్లా ప్రజలందరికీ అనుబంధం ఉంది
• ఆ మార్కెట్ పై పేద వర్గాలు ఆధారపడుతున్నాయి... వేలం వేసి వారిని రోడ్డునపడేస్తారా?
• తక్షణం ప్రభుత్వ ఆస్తుల వేలాన్ని ఉపసంహరించుకోవాలి
• గుంటూరు నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు

రాష్ట్రానికి సంపద సృష్టించాలి అంటే పెట్టుబడులు తీసుకురావాలి... అందుకు అనువైన మార్గాలు అన్వేషించాలి... ఈ ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళడం లేదని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. సంపద సృష్టించడం లేదు సరికదా ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు అన్నారు. ప్రజా ఆస్తులు అమ్మడం అంటే పాలన వైఫల్యమే అని స్పష్టం చేశారు. గుంటూరు నగరానికి ల్యాండ్ మార్క్ లాంటి పి.వి.కె.నాయుడు మార్కెట్ ను వేలానికి పెట్టి అమ్మేయాలనుకోవడం సరికాదు అన్నారు. బుధవారం రాత్రి గుంటూరు జిల్లా జనసేన నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని పి.వి.కె.నాయుడు మార్కెట్ ను అమ్మాలనే ప్రభుత్వం నిర్ణయాన్నీ, పెరిగిన విద్యుత్ బిల్లుల తీరును వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా గుంటూరు నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి పార్టీ పి.ఏ.సి. సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్, పార్టీ లీగల్ విభాగం నాయకులు శ్రీ గాదె వెంకటేశ్వర రావు, సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యురాలు శ్రీమతి పాకనాటి రమాదేవి తదితరులు 24 గంటల దీక్ష చేపట్టారు. వీరికి శ్రీ పవన్ కల్యాణ్ గారు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “సంపద సృష్టించి, ఉపాధి కల్పించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలా కాకుండా ఉన్న ఆస్తులు అమ్మేసి, వాటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడినవారిని రోడ్డున పడేయడం ఏమిటి? గుంటూరు నగరంలో పి.వి.కె.నాయుడు మార్కెట్ ఒక ల్యాండ్ మార్క్. ఈ మార్కెట్ తో నగర ప్రజలకు ఒక అనుబంధం కొన్ని దశాబ్దాలుగా ఉంది. ఆ మార్కెట్ మీద ఆధారపడి 5 వేల మంది చిరువ్యాపారులు బతుకుతున్నారు. పేద వర్గాలకు చెందినవారికి ఆ మార్కెట్ ఒక ఉపాధి కేంద్రం. ముస్లింలు, బీసీలు, పేద కులాలకు ఆ మార్కెట్ ఒక ఆధారం. దాన్ని అమ్మేసి వారందరినీ రోడ్డున పడేస్తారా? గుంటూరు పరిసరాల నుంచి, పల్నాడు ప్రాంతం నుంచి ఎంతోమంది నిత్యం రైతులు తమ పంటలు అమ్ముకొనేందుకు నిత్యం పి.వి.కె.నాయుడు మార్కెట్ కు వస్తారు... వారికి అన్యాయం చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజా ఆస్తుల విక్రయించాలి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. పి.వి.కె.నాయుడు మార్కెట్ ను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తులు అమ్మడంతో తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం ఏర్పడింది. పెట్టుబడులు వచ్చే మార్గాన్ని ఈ ప్రభుత్వం అన్వేషించడం లేదు. కరోనాతో ప్రజలందరూ ఆందోళనతో ఉంటే ప్రభుత్వం అండగా నిలవాల్సిందిపోయి విద్యుత్ బిల్లు పెంచేసి ఇబ్బందిపెడుతోంది.... మరో వైపు ప్రజా ఆస్తులను అమ్మేస్తోంది. జనసేన నాయకులు, శ్రేణులు ప్రజా ఆస్తుల వేలాన్ని వ్యతిరేకిస్తూ, విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ చేస్తున్న దీక్షలు నా మనసును కదిలించాయి. ఎప్పుడూ నాయకులు, శ్రేణులకు బాసటగా నిలుస్తాం” అని చెప్పారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “నగరం నడిబొడ్డున ఉన్న పి.వి.కె.మార్కెట్ ను అమ్మేయాలి అనుకోవడం ప్రభుత్వ మొండి వైఖరినీ, ప్రజా వ్యతిరేక విధానాలను సూచిస్తోంది. ఈ జిల్లా ప్రజలకు ఈ మార్కెట్ తో ఎంతో అనుబంధం ఉంది. కొన్ని వేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మార్కెట్ పై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ మార్కెట్ ను అమ్మేయాలి అని నిర్ణయించిన రోజు నుంచీ జనసేన నాయకులు, శ్రేణులు దీక్షలు చేస్తూ పోరాటం చేస్తున్నాయి” అన్నారు. శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ “పేద ప్రజలకు, చిరువ్యాపారులకు కేంద్రమైన ఈ మార్కెట్ ను అమ్మాలని నిర్ణయాన్ని మన పార్టీ బలంగా వ్యతిరేకిస్తోంది. కరోనా కష్టాల్లో జనం ఉంటే ప్రభుత్వం దురాలోచనతో వ్యవహరిస్తోంది. విద్యుత్ బిల్లుల పెంచడంతో ప్రజలు తీవ్ర అవస్థల పాలవుతున్నారు” అన్నారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె.) మాట్లాడుతూ “పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ఆస్తుల విక్రయంపై గుంటూరు నగరంలోని పార్టీ శ్రేణులతోపాటు, జిల్లావ్యాప్తంగా పలుచోట్ల దీక్షలు చేపడుతున్నాం. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి సేవలు చేయడంతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించేలా కార్యక్రమాలు సాగిస్తున్నాం” అన్నారు. శ్రీ గాదె వెంకటేశ్వర రావు మాట్లాడుతూ “గుంటూరు నగరానికి గుండెకాయ లాంటి ఆస్తి పి.వి.కె.నాయుడు మార్కెట్. ఇది విలువైన ప్రాంతం. వేల మంది చిరు వ్యాపారులు బతుకుతున్నారు. ఆస్తుల అమ్మకంపై హైకోర్టులో కేసు ఉంది. అయినప్పటికీ వేలం ప్రక్రియపై ముందుకే ప్రభుత్వం వెళ్తోంది” అన్నారు. శ్రీమతి పాకనాటి రమాదేవి మాట్లాడుతూ “లాక్డౌన్ మొదలైన రోజు నుంచీ ఇప్పటి వరకూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలందరికీ మన పార్టీ సేవలు చేస్తోంది” అన్నారు. నగర నాయకులు శ్రీ పెద్దబోయిన బాలయ్య, శ్రీమతి బిట్రగుంట మల్లిక, శ్రీ నక్కల వంశీకృష్ణ నగరంలో పరిస్థితిని వివరించారు.

More Press Releases