నాగలి పట్టి దుక్కి దున్నిన తెలంగాణ మంత్రి అల్లోల

Related image

  • రోహిణి కార్తెలో తన పంటపొలంలో వరి తుకం అలికిన మంత్రి
నిర్మల్, మే 27: అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాగలి పట్టి దుక్కి దున్నారు. రోహిణీ కార్తె వానకాలం ప్రారంభంలోనే పంటలు వేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన స్వగ్రామం ఎల్లపల్లిలోని తన పంటపోలంలో దుక్కి దున్ని వరి తుకం అలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తెలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వచ్చి రైతుకు మేలు జరుగుతుందన్నారు. సీఎం కేసిఆర్ పిలుపు మేరకు రైతుల నుంచి కూడా విశేష స్పందన వస్తుందని తెలిపారు. రోహిణిలో వరి సాగు చేసుకుంటే తరువాయి సీజను పంటను సకాలంలో వేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారని వివరించారు. అలికిన పంటలకు చీడపీడల ఉధృతి కూడా తక్కువగా ఉంటుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు కన్వీనర్ నల్లా వెంకట్ రాంరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు అల్లోల మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, గౌతంరెడ్డి, ముత్యంరెడ్డి, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases