రైల్వే అండ‌ర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిల నిర్మాణంపై ద‌క్ష‌ణ మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌తో చ‌ర్చించిన‌ మంత్రి కేటీఆర్

Related image

హైద‌రాబాద్‌, మే 04: ప్రజల సౌకర్యార్థం చేపట్టిన రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు సమన్వయముతో వ్యవహరిద్దామని దక్షిణ మధ్య రైల్వే అధికారులను తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు కోరారు. నగర పరిధిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, లింక్ రోడ్లు, స్లిప్ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే పరిధిలో వున్న పనులలో వేగాన్ని పెంచుటకు రైల్వే శాఖతో సమన్వయముకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్మాల్యా, ఇతర అధికారులతో పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చర్చించారు.

జీహెచ్ఎంసీ ఇప్పటికే అనేక రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎస్ఆర్డిపి, సిఆర్ఎంపి, స్లిప్, లింకు రోడ్ల పనులను పూర్తి చేసేందుకు ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలో పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి రైల్వే, రైల్వే అండర్ బ్రిడ్జిలకు సంబంధించిన పనులు పెండింగులో ఉన్నాయి. ఆయా పనులను పూర్తి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సహకారాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న ఆర్వోబి, ఆర్.యు.బి ల ప్రగతిని దక్షిణ మధ్య రైల్వే అధికారులతో చర్చించారు.

జీహెచ్ఎంసీ రోడ్డు వర్కులతో పాటు హైదరాబాద్ జల మండలికి సంబంధించిన కొన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా దక్షిణ మధ్య రైల్వేతో జతకూడి ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా సమావేశంలో చర్చిస్తున్న మంత్రి, అధికారులు రైల్వే శాఖ కూడా జీహెచ్ఎంసీ మాదిరి వేగంగా పనులను పూర్తి చేసి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా చూడాలని కోరారు. వచ్చే వర్షాకాలం లోపల సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల రైల్వేకు సంబంధించిన పనులను పూర్తి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు.

ఆర్ఓబి/ఆర్.యు.బి ల పూర్తికి చేపట్టే పనులకు అవసరమైన అన్ని రకాల అనుమతులను ప్రాధాన్యతగా గుర్తించి జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే తమ వైపు పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ప్రతిపాదిస్తున్న స్లిప్, లింక్ రోడ్లు విస్తరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జిలపై రైల్వే అధికారులతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. దక్షిణ మధ్య  రైల్వేతో సమన్వయమునకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ను నియమిస్తున్నట్లు తెలిపారు.

రైల్వే  క్రాసింగ్స్ వద్ద ప్రమాదాల నివారణకు ఆయా ప్రాంతాలలో చేపట్టాల్సిన పనులను సూచించుటకు నిపుణులు కమిటీ నియమించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన ఈ సమావేశoలో నగర మేయర్ బొంతురామ్మోహన్, దక్షిణ మధ్య  రైల్వే జీఎం గజానన్ మాల్య, రైల్వే ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డిఎస్ లొకేశ్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, చీఫ్ ఇంజనీర్లు వసంత, శ్రీధర్, జియాఉద్దీన్, సిసిపి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases