హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ సంకల్పం: మంత్రి కేటీఆర్

Related image

హైదరాబాద్: ప్రస్తుతం నగరంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు పోవాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సూచన చేశారు. ఇది వర్కింగ్ సీజన్.. ఒక నెలపాటు పనులు చేయవచ్చు.. జూన్ నుండి వర్షాలు వస్తాయని పేర్కొన్నారు. శనివారం బుద్దభవన్ లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, కమీషనర్ డిఎస్ లోకేష్ కుమార్ లతో కలిసి హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్రింద చేపట్టిన పనుల ప్రగతిని మంత్రి కేటీఆర్ సమీక్షించారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

దేశంలో లాక్ డౌన్ ను చక్కగా వినియోగించుకున్న రాష్టంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. మే నెలలో కొన్ని పనులను ప్రారంభించుకుందామని తెలిపారు. అందుకనుగుణంగా పనులకు తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సూచించారు. వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన లింక్ రోడ్లలో అక్కడక్కడ అటంకంగా వున్న భూముల సేకరణ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో నిర్వాసితులయ్యే  పేదలు, కూలీల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలన్నారు. అటువంటి నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా పునరావాసం కల్పించాలని చెప్పారు.

జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు వుండాలని చెప్పారు. భవిష్యత్తులో ఈ లింక్ రోడ్ల వలన ఆయా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఎస్ఆర్డిపి, లింక్, సర్వీస్ రోడ్లను మరింత ప్రయోజనకరంగా పొడిగించేందుకు హెచ్ఎండిఎ, ఇతర విభాగాలతో సమన్వయము చేసుకోవాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలు, పెరిగే ట్రాఫిక్ రద్దీని అంచనా వేసి పనులు చేపట్టాలని వివరించారు. హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ ను అప్ డేట్ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగా రోడ్ల నిర్మాణమునకు అవసరమైన భూసేకరణ చేయాలని తెలిపారు.  

అలాగే నిర్మాణంలో వున్న  రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జి లతో పాటు, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కూడా  అవసరమైన భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు, భూసేకరణకు నిధులు కొరత లేదని పేర్కొన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో మాజీ ఎంపీ / కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఎండీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఈవిడిఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, సిసిపి దేవేందర్ రెడ్డి, ఈఎన్సి శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, ఎస్ఈ లు, ఈఈ లు, భూసేకరణ విభాగం అధికారులు పాల్గొన్నారు.

More Press Releases