రైతుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: తెలంగాణ మంత్రి పువ్వాడ

Related image

  • వరి ధాన్యం, మక్కల కోసం స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం-మంత్రి పువ్వాడ
  • రైతు పండించిన ధాన్యాన్ని 100శాతం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు
  • ప్రతి పీఏసీ చైర్మన్ కథానాయకుడిగా వ్యవహరించాలి
  • మనం రైతులకు జవాబు దారులం.. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి
నేలకొండపల్లి(ఖమ్మం): ధాన్యం కొనుగోలు, కొనుగోలు చేసిన ప్రతి ధాన్యపు గింజను నిల్వ చేయడానికి జిల్లా వ్యాప్తంగా సరిపడే స్టోరేజిని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం ముదిగొండలోని ఉషా శ్రీ జిన్నింగ్ మిల్, నేలకొండపల్లి లోని మధుకాన్ షుగర్స్ లోని ధాన్యం నిల్వచేసే ప్రాంతాలను పరిశీలించారు. ప్రభుత్వ గోడములతో పాటు ప్రైవేట్ సంస్థల స్టోరేజ్ లను కూడా వినియోగించనున్నట్లు తెలిపారు. ఉషశ్రీ జిన్నింగ్ మిల్స్ లో 4,500 మెట్రిక్ టన్నులు, ఎంపీ నామా నాగేశ్వరరావు సహాకారంతో మధుకాన్ షుగర్స్ లో 7,500 మెట్రిక్ టన్నుల స్టోరేజ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆయా ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడి ధాన్యం అక్కడే నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి రైతుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. దీని కోసం పీఏసీ చైర్మన్లు ఎక్కడికక్కడ కథనాయకుని పాత్ర పోషించాలన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నా.. రైతు పండించిన పంటను ముఖ్యమంత్రి పూర్తిగా కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా మీకు క్షేత్రస్థాయిలో వాటిపై అవగాహన ఉంటుందని  రైతులతో మంచి సంబంధాలు ఉంటాయి కాబట్టి సమస్యల పరిష్కారానికి కథనాయకుని వలె వ్యవహరించాలన్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి మనకు రెగ్యులర్ గా వచ్చే హమాలీలు రావడం లేదన్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో లోకల్ హమాలీలను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపుకు ట్రాన్స్ పోర్ట్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గ్రామాల్లో ఉన్న లోకల్ ట్రాక్టర్ లను, లారీలను గుర్తించి వాటిని వినియోగించుకోవాలని సూచించారు. వివిధ కారణాల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్న రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో నోడల్ ఆఫీసర్లు, జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేస్తారన్నారు.

మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నేరుగా నన్ను సంప్రదించవచ్చని మంత్రి అన్నారు. జిల్లాలో 68వేల మెట్రిక్ టన్నుల మక్కలు, 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. వీటికి సంబంధించి అదనంగా మరో లక్ష మెట్రిక్ టన్నులకు సరిపడు స్టోరేజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా కొనుగోలు పూర్తి చేస్తాం. గత ఏడాది జూన్ వరకు 1.31 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొంటె, ఈ ఏడాది దాదాపు 3.30 లక్షల మెట్రిక్ టన్నుల భారం ప్రభుత్వం పై పడింది. అయిన రైతాంగాన్ని ఆదుకోవాలని తలచి పౌరసరఫరా శాఖ ద్వారా కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేవలం 20 రోజుల్లోనే 2 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొన్నాం. వాటికి సంబంధించి రైతులకు 80కోట్ల రూపాయల చెల్లింపులు కూడా చేశామన్నారు.

రైతులకు ఇబ్బంది కలుగకుండా  ఒక పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేశామని దానికి అనుగుణంగా పనిచేస్తున్నామని వివరించారు. ధాన్యం సేకరణ మన రాష్ట్రంలో జరిగినట్లు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదని, కరోనాను సాకుగా చూపి మిగతా ఏ రాష్ట్రం కూడా రైతు పండించిన పంటను కొనడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి రైతు శ్రేయస్సు కోసం ఆలోచన చేసి రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

కార్యక్రమంలోజడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు, మార్కుఫెడ్ జిల్లా అధికారి సుధాకర్ తదితరులు ఉన్నారు.

More Press Releases