కర్నూలులో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది: పవన్ కల్యాణ్

Related image

• జబ్బును దాచేస్తే దాగదు... మరింత పెరిగి పెద్దదవుతుంది
• కరోనా వ్యాప్తి విషయంలో మతం కోణం చూడవద్దు... ఎవరికీ ఆపాదించడం తగదు
• రైతులు తమ పంటలు అమ్ముకోలేక నష్టపోతున్నారు... పేదలు ఎన్నో ఇక్కట్లలో ఉన్నారు  
• కష్ట కాలంలో రాజకీయాలు కాదు... ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా
   స్పందించడమే ముఖ్యం
• కర్నూలు జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్

కర్నూలు నగరంలో, జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా జబ్బును దాచేస్తే దాగదు.... అది ముదిరిపోయి మరింత భయపెడుతుంది అన్నారు. పెరిగి పెద్దదయ్యాక ప్రజలు మరిన్ని కష్టాలుపడాల్సి వస్తుంది అని చెప్పారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో విధించిన లాక్ డౌన్ వల్ల రైతాంగం, పేద ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. సోమవారం సాయంత్రం కర్నూలు జిల్లా జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల, లాక్ డౌన్ పరిణామాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “కరోనా వ్యాప్తి అనేది ప్రపంచంలో ఎవరూ ఊహించని ఉత్పాతం. ఈ మహమ్మారి మూలంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముందుగానే నియంత్రణ చర్యలు చేపట్టారు. కర్నూలు ప్రాంతంలో చాలా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ జిల్లాలో పరిణామాలను తెలుసుకొంటూ ఉన్నాను. బీజేపీ నాయకులు శ్రీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు జిల్లాలో పరిస్థితి గురించి ఆవేదన చెందుతూ ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. ఈ మహమ్మారి విజృంభిస్తుంటే ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందీ, యంత్రాంగం వైఫల్యం గురించి అందులో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ జిల్లాలోను, కర్నూలు నగరంలోను కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటం బాధాకరం.

కరోనా వ్యాప్తి విషయాన్ని మతం కోణంలో చూడటం తగదు. ఎవరికీ ఆపాదించవద్దు. ఇది మానవాళికి వచ్చిన విపత్తు. దీన్ని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలో రైతాంగం ఎన్నో కష్ట నష్టాలను  ఎదుర్కొంటోంది. తమ పంటను అమ్ముకోలేకపోతున్నారు. పేద వర్గాలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నాయి. ఈ తరుణంలో రాజకీయాల కంటే ప్రజల కష్టాలు తీర్చేలా పని చేయడం ముఖ్యం. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారమయ్యే విధంగా స్పందించడమే మన విధానం. కర్నూలు జిల్లా నుంచి వలస వెళ్ళిన కార్మికులు ఇబ్బందులుపడుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ ఠాక్రే గారు స్పందించారు.

•    తోటి మనిషికి అండగా నిలుస్తున్నారు
ఈ క్లిష్ట సమయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. చిన్నపాటి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నవారు తమ స్థాయిలో తోటి మనిషికి అండగా నిలుస్తున్నారు. జనసేన నాయకులు, శ్రేణులకు నా విజ్ఞప్తి ఏమిటంటే... మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నియమనిబంధనలు పాటిస్తూ, స్వీయ రక్షణ చర్యలు తీసుకొంటూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి” అని చెప్పారు.

•    పరిస్థితి ప్రమాదకరంగా ఉంది: నాదెండ్ల మనోహర్  
రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో కరోనా విస్తృతి ప్రమాదకరంగా ఉంది. కర్నూలులో అత్యధిక కేసులు వస్తున్నాయి. కర్నూలు ఎంపీ చేసిన వ్యాఖ్యలు చూస్తే పరిస్థితి చేయి దాటిపోతోంది అనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, పౌరులను ఆదుకోలేకపోతున్న విధానంపై తగిన రీతిలో స్పందిద్దాం. ఈ సమయంలో మన నాయకులు, కార్యకర్తలు ఎంతో సంయమనం, సహనం పాటిస్తూ ప్రజలకు సేవలు చేస్తున్నారు. సహృదయంతో సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. వ్యవసాయ రంగంలో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. వీటిపై శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ సమస్యను తెలియచేస్తున్నారు” అన్నారు.

•    పేదలకు సహాయం చేద్దామన్నా ఆంక్షలే
కర్నూలు జిల్లా నాయకులు కరోనా వ్యాప్తి తీరు, ఆసుపత్రుల నిర్వహణ, ప్రజా సమస్యలను పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. పాణ్యం ఇంచార్జ్ చింతా సురేశ్ బాబు మాట్లాడుతూ కర్నూలు నగరంలో కేసుల విషయంపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకుండా, లెక్కలు దాయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని చెప్పారు. ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖా గౌడ్ మాట్లాడుతూ క్వారెంటైన్ లో ఉన్నవారికిగానీ, ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నవారికీ తగిన వైద్య సహాయం, ఆహారం అందడం లేదని తెలిపారు. జనసేన నాయకుడు అర్షాద్ పరిస్థితిని వివరిస్తూ “రంజాన్ మాసం మొదలైంది... ముస్లింలు ఇంట్లోనే ఉండి ప్రార్థనలు చేసుకొంటున్నారు. కర్నూలు ఓల్డ్ టౌన్ లో పేదలకు చాలా బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం రెడ్ జోన్లో ఉంది. సహాయ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం లేకుండా ఉంది. పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా నిత్యావసరాలతో కిట్లు ఇద్దామన్నా సాధ్యం కావడం లేదు. ఆంక్షలు విధిస్తున్నారు.

మార్కెట్లో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు, మాస్కులు ధరించడం లేదు” అన్నారు. పాణ్యం, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులకు నాలుగు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో ఆ వర్గం వారు ఇబ్బందులు పాలవుతున్న విషయాన్ని ఆ ప్రాంత నాయకులు అధ్యక్షులవారి దృష్టికి తెచ్చారు. మామిడి, టమోటా, ఉల్లి రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారని చెప్పారు. కర్నూలు జిల్లా నుంచి వలస కూలీలు గుంటూరు ప్రాంతానికి మిర్చి కోతకు వెళ్ళి చిక్కుకుపోయారని... స్వస్థలాలకు తిరిగి రాలేక, పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నంద్యాలలో కరోనా వార్డుల్లో వాడిన గ్లవుజులు, మాస్కులు, ఇతర వైద్య సామగ్రిని ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా డిస్పోజ్ చేయకుండా డంపింగ్ యార్డుల్లో వేయడం, తగలపెట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలు అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అని తెలిపారు.

More Press Releases