రంగనాయక సాగర్ వరకు విజయవంతంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు.. సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

Related image

ప్రస్తుతం రంగనాయక సాగర్ వరకు విజయవంతంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వస్తున్నదని, ఆ నీటిని ఈ వానాకాలంలోనే కొండ పోచమ్మ సాగర్ వరకు తరలించేందుకు విద్యుత్ శాఖ చేస్తున్న ఏర్పాట్ల పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కారం, మర్కూక్ పంపుహౌజుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావుకు సీఎం ఫోన్ చేసి మాట్లాడారు. కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు జరుగుతున్న లిఫ్టు పనులపై సీఎం ఆరాతీశారు. నాలుగైదు రోజుల్లో లిఫ్టులన్నీ సిద్ధం చేయాలని కోరారు. ఈ వానాకాలంలోనే కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలిస్తామన్నారు. విద్యుత్ శాఖ మొదటి నుంచి నిర్ణీత గడువులోగా తమ పనులు పూర్తి చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.

నాలుగైదు రోజుల్లో లిఫ్టులు సిద్ధం: సీఎండి

కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఈ వానాకాలంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు తరలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం కాళేశ్వరం నీటిని రంగనాయక్ సాగర్ వరకు విజయవంతంగా లిఫ్టు చేయగలుగుతున్నామని, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అక్కారం, మర్కూక్ పంపుహౌజుల పనులను ప్రభాకర్ రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి జరగుకుండా అన్ని నియమాలు పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీటిని రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నందున, అందుకు తగ్గట్టు పంపుహౌజులను సిద్ధం చేయాలని కోరారు.

‘‘ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టు నీరు రంగనాయక్ సాగర్ వరకు విజయవంతంగా చేరుకుంది. అక్కడి నుంచి మల్లన్న సాగర్ కు, తర్వాత కొండ పోచమ్మ సాగర్ కు నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన లిఫ్టులను విద్యుత్ శాఖ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నది. అక్కారంలో 162 మెగావాట్ల సామర్థ్యం (6x27) కలిగిన పంపుసెట్లు సిద్ధంగా ఉన్నాయి. అక్కడి నుంచి నీరు మర్కూక్ చేరుకుంటుంది. మర్కూక్ నుంచి నీటిని ఎత్తిపోయడానికి 204 మెగావాట్ల సామర్థ్యం (6x34) కలిగిన పంపులు సిద్దమయ్యాయి. నాలుగు బృందాలు రేయింబవళ్లు పని చేస్తున్నాయి. టెస్టింగ్ పూర్తి చేసి, నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తాం’’ అని సిఎండి చెప్పారు.

సిఎండి ప్రభాకర్ రావు వెంట ట్రాన్స్ కో జెఎండి సి.శ్రీనివాస రావు, డైరెక్టర్ జె.సూర్యప్రకాశ్, ఇడి పివి ప్రభాకర్ రావు, ఎస్.ఇ. ఆంజనేయులు, ఎస్.ఇ. వేణు తదితరులున్నారు.

ప్రత్యేక అనుమతులతో ముంబయి నుంచి నిపుణుల బృందం రాక:

పంపుహౌజుల కేబుల్ పనులు చేసే రాహుల్ కేబుల్ ఇంజనీరింగ్ కు చెందిన నిపుణుల బృందం లాక్ డౌన్ కారణంగా ముంబయిలో చిక్కుకుంది. వారు వస్తే తప్ప ఇక్కడ పనులు జరిగే అవకాశం లేదు. దీంతో ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డికి లేఖ రాశారు. డిజిపి మహారాష్ట్ర డిజిపికి లేఖ రాసి, ఫోన్ ద్వారా మాట్లాడి ప్రత్యేక అనుమతి ఇప్పించారు. దీంతో ప్రత్యేక అనుమతితో కూడిన వాహనాల్లో నిపుణుల బృందం ఈ నెల 21న సిద్దిపేట జిల్లాకు చేరుకుంది. వారి ఆధ్వర్యంలో పంపుహౌజుల కేబుల్ పనులు నడుస్తున్నాయి.

More Press Releases