నిత్యావసర సరుకులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సును కిరాణం దుకాణంగా మార్చిన తెలంగాణ మంత్రి

Related image

ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిన నేపథ్యంలో బాధితుడిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి క్వారెంటైన్ కు తరలించింది. ఆయా ప్రాంతాన్ని ప్రభుత్వం రెడ్ జోన్ గా పరిగణించిన విషయం విదితమే. స్థానిక పరిస్థితులను తెలుసుకునేందుకు బుధవారం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పెద్దతండాలో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకై ప్రభుత్వ నిబంధనలను పాటించి సహకరించాలని కోరారు.

నిత్యావసర సరుకులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సు ద్వారా సరుకులు తీసుకొచ్చి బస్సునే కిరాణం దుకాణంగా మార్చమని వివరించారు. ఇప్పటికే ప్రతి మనిషికి 12 కేజీల చొప్పున బియ్యాన్ని అందజేయగా, ప్రభుత్వ అందిస్తున్న రూ.1500 రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నట్లు చెప్పారు. వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించామని, పరిస్థితి అడుపులోనే ఉందని, నిత్యం గ్రామంలో బ్లీచింగ్, హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారి చేయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ వివరించారు. ఏప్రిల్ 30 వరకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అవసరమయ్యే అన్ని సరుకులు మీ వద్దకే వస్తాయని ఎలాంటి పరిస్థితులలో ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావొద్దని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, వార్డ్ ప్రత్యేక అధికారి పరంధామ రెడ్డి తదితరులు ఉన్నారు.

More Press Releases