పర్యాటకులను ఆకట్టుకునేలా పర్యాటక ప్రదేశాలకు ప్రచారం నిర్వహిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా చార్మినార్ నుండి మహబూబ్ నగర్ లోని మయూరి ఎకో పార్కు వరకు సుమారు 300 మోటారు వాహనాల తో బైక్ రైడ్ ను చార్మినార్ వద్ద రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు పెట్టని కోట అని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు వాటికి తగినంత ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించేందుకు, ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అవగాహన కల్పించడంతో పాటు రోడ్డు భద్రతా చర్యల స్పూర్తిని కలిగిస్తూ ఈ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ఐకాన్ గా ఉన్న చార్మినార్ నుండి  మహబూబ్ నగర్ లోని  మయూరి ఎకో పార్క్ వరకు జరుగుతున్న ఈ ర్యాలీ లో సుమారు 300 మంది బైక్ రైడర్ లు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో లో చారిత్రక, వారసత్వ, ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్న ప్రాంతాలతో పాటు ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టులలో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్టు తో పాటు ఇతర నీటి పారుదల ప్రాజెక్టులు అయినా మెడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, కన్నెపల్లి ప్రాజెక్టుల తో పాటు ధర్మపురి, కాళేశ్వర దేవాలయం లాంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు.

మన దేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ తగినంత ప్రచారం లేకపోవడం వల్ల పర్యాటకులను ఆకర్షించలేక పోతున్నాం. ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటకుల ద్వారా వచ్చిన ఆదాయం వల్లనే అభివృద్ధి సాధించాయన్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి తో పాటు వాటికి తగినంత ప్రచారం నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ర్యాలీలో పాల్గొన్న బైక్ రైడర్ అసోసియేషన్ ప్రతినిధులు జయ భారతి, శాంతి, సందీప్, కల్నల్ ఎం ఏ కలీం లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

More Press Releases