ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి

Related image

  • ప్రతి రెవిన్యూ గ్రామాల-లో కొనుగోలు కేంద్రాలు

  • కొత్తగా 104 కొనుగోలు కేంద్రాలు

  • అవసరమైన చోట పెంచే యోచన

  • రవాణా వసతి ఉన్న చోట కల్లాల వద్దే కొనుగోలు కేంద్రాలు

  • కరోనా వైరస్ కొనుగోలుకు అడ్డు కాదు

  • రైతాంగాన్ని ఆదుకునేందుకే కొనుగోలు కేంద్రాల పెంపు

  • వత్తిడి పెరగకుండా చర్యలు

  • రైతులూ సంయమనం పాటించాలి

  • పండించిన పంట మొత్తం కొనుగోలు చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం

  • నాణ్యత విషయంలో రాజీలేదు

  • రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం

  • నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం

రబీలో పండించిన పంటను సత్వరమే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ ధాన్యం కొనుగోలుకు ఏ రకంగా అడ్డు కాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తేల్చి చెప్పారు. అయితే అదే సమయంలో రైతులు సంయమనం పాటించాలని మంత్రి జగదీష్ రెడ్డి రైతాంగానికి విజ్ణప్తి చేశారు.

యాసంగిలో పండించిన పంట కొనుగోలు విషయంలో అనుసరించాల్సిన విధానంపై శనివారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, శాసనసభ సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు హాజరైన సమీక్షలో పలు అంశాలపై చర్చించారు.

కరోనా మహమ్మారితో చేతికొచ్చిన పంట కొనుగోలుపై రైతుల్లో వెల్లువెత్తుతున్న పలు అనుమానాలకు బ్రేక్ చేస్తూ ప్రతి గింజను కొనుగోలు చేసే విదంగా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే జిల్లాలో మొత్తం 31 మండలాల పరిధిలోని 844 గ్రామ పంచాయతీలలో రేవిన్యూ గ్రామలుగా గుర్తించిన 563 లలో 236 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలనుకున్న ప్రభుత్వం కరోనా వైరస్ నేపధ్యంలో ఆ సంఖ్యను 340 కి పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. కొత్తగా పెంచిన 104 కొనుగోలు కేంద్రాలతో పాటు, రవాణ సౌకర్యం ఉండి రైతులు సమిష్టిగా ఒక్క దగ్గరకు చేరగలిగితే కల్లాల వద్ద సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని ఆయన చెప్పారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పద్దతిలో ఆదేశాలు ఇచ్చి ఉన్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అంతే గాకుండా ముందెన్నడూ లేని రీతిలో పంట దిగుబడి పెరిగిందని అయితే కరోనా వైరస్ కొంత గందరగోళంలో పడేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రైతును ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు పై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

జిల్లాలో వరి పంట వేసిన మొత్తం లక్షా 26 వేల 450 హెక్టార్లలో ఐదు లక్షల 96 వేల 960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందన్న అధికారుల అంచనాలను ఏకీభవిస్తూనే పంట దిగుబడిని పట్టి కొనుగోలు కేంద్రాలు ఉండేలా చూడాలని మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సూచనకు అనుగుణంగా అధికారులు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను నాలుగు తరగతులు గా విభజించారు.

అధిక పంట దిగుబడి అయ్యే వాటిల్లో అంటే 20 వేల మెట్రిక్ టన్నుల పై బడి ధాన్యం వచ్చే విగా భావిస్తున్న 14 మండలాలూ, మధ్యస్తంగా దిగుబడి వచ్చే(10 వేల మెట్రిక్ టన్నుల పైబడి) వాటిల్లో 7 మండలాలుగా గుర్తించిన అధికారులు ఐదువేల మెట్రిక్ టన్నులపై బడి దిగుబడివచ్చే వాటిల్లోఉన్న రెండు మండలాలు పోను మిగితా ఎనిమిది మండలాలను ఐదు వేల లోపుగా గుర్తించారు. అయితే అదే సమయంలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.

అందులో భాగంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలతో పాటు, ఎలక్ట్రానిక్  కాంటాలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ కొరకు గిన్ని బ్యాగులు సిద్దం చేయాలన్నారు. ట్రాక్టర్ వెళ్ళే గ్రామాల్లో రైతులు కల్లాలు ఏర్పాటు చేసుకుంటే కొనుగోలు కు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమ కొలిచే యంత్రాలతో పాటు టార్ఫాలిన్లు, గన్ని బ్యాగులను సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. 

ధాన్యం కొనుగోలు లో దళారులు రైతులను మోసం చేస్తే కటినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి కేంద్రానికి ఒక ట్యాబ్ ద్వారా ఐ‌డి పాస్ వర్డ్ అందజేసి మిల్లర్స్, రైతులకు అనుసందానం చేస్తామని అన్నారు. ధాన్యన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాలను సిద్దంగా ఉంచినట్లు  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు ధాన్యం రాకుండా చెక్ పోస్ట్ లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. 

 ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లులు పని చేసే విదంగా చూడాలని అదికారులకు సూచించారు. జిల్లాలో ఎఫ్‌సి‌ఐ గొదామ్ లు పూర్తి నిల్వ సామర్థ్యం లేనందున ఇతర ప్రాంతాలకు ధాన్యం నిలువలు చేయడం జరుగుతుందని మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకరాగ ఆయన అందుకు సానుకూలంగా స్పందించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్‌పి ఏ.వి.రంగ నాథ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, డి‌ఎం సివిల్ సప్లయ్ నాగేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases