సామాజిక దూరంపై లక్షల మందికి అవగాహన: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

Related image

  • ఇ మెయిల్ విధానంలో విద్యార్ధి లోకానికి పిలుపు నివ్వాలన్న గవర్నర్
  • కరోనా నివారణ కోసం విశ్వ విద్యాలయాల మౌళిక వసతుల సద్వినియోగం
విశ్వ విద్యాలయ విద్యార్ధులు కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నిబంధనల మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ కుటుంబ సభ్యులను కూడా ఆ దిశగా ప్రేరేపించాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశ్వ విద్యాలయాల కులపతి హోదాలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ అచార్య హేమ చంద్రా రెడ్డి, ఇతర అధికారులతో విజయవాడ రాజ్ భవన్ వేదికగా శనివారం సమావేశం అయ్యారు. ఈ క్రమంలో విశ్వ విద్యాలయాలలో ఉన్న తాజా పరిస్ధితులను తెలుసుకున్న గవర్నర్, ప్రతి విద్యార్ది సామాజిక దూరం గురించి కుటుంబ సభ్యులకు తెలిసేలా తమ వంతు ప్రయత్నం చేయాలని, ఈ మేరకు ఆయా విశ్వ విద్యాలయాల ఉపకులపతులు తమ పరిధిలోని కళాశాలల ద్వారా విద్యార్ధులకు ఈ మెయిల్ విధానంలో పిలుపును ఇవ్వాలని సూచించారు.

ఈ క్రమంలో ప్రతి విద్యార్ధి తమ కుటుంబ సభ్యులకు సామాజిక దూరం గురించి అవగాహన కలిగించగలిగినా ఈ సందేశం లక్షల మందికి చేరుతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వైపు విశ్వ విద్యాలయాలలో అందుబాటులో ఉన్న మౌళిక వసతులను ప్రస్తుత కష్ట కాలంలో సద్వినియోగ పరుచుకోవలసి ఉందని, అతి త్వరలోనే తాను ఈ అంశానికి సంబంధించి విశ్వ విద్యాలయాల కులపతులతో సమావేశం కానున్నానని హరిచందన్ పేర్కొన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోని ప్రభుత్వానికి, పాలనకు తోడ్పడటానికి విశ్వవిద్యాలయ వనరుల వినియోగం గురించి దృశ్య శ్రవణ విధానంలో విసిలతో తాను చర్చిస్తానన్నారు. ఈ సమావేశంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

More Press Releases