ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే విధంగా రైతులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు: మంత్రి తలసాని

Related image

విజయ డెయిరీలో సభ్యతం కలిగి ఉండి పాలు పోయని పాడి సొసైటీల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య , సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన విజయ డెయిరీ 10 వ బోర్డు సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. 

చైర్మన్ లోక భూమా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పశుసంవర్ధక శాఖ  కార్యదర్శి అనిత రాజేంద్రన్, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డెయిరీ ఎండీ శ్రీనివాస్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డెయిరీలో సభ్యత్వం కలిగి ఉండి విజయ డెయిరీకి పాలు పోయని రైతుల సమాచారం జిల్లాల వారిగా తెప్పించాలని అన్నారు. అవసరమైతే వారి సభ్యత్వాలను రద్దు చేసేందుకు వెనుకాడేది లేదన్నారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకం ఇస్తున్నప్పటికీ కొందరు రైతులు ప్రైవేట్ డెయిరీలకు పాలు విక్రయిస్తున్నారని అన్నారు. మరికొందరు సొసైటీల సభ్యులు ప్రైవేట్ డెయిరీలకు పాలు పోసే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

అవసరమైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సొసైటీల ప్రక్షాళన చేయాలని వివరించారు. కొత్తగా పాలు పోసేందుకు ముందుకొచ్చే రైతులకు సభ్యత్వాలు ఇవ్వాలని అన్నారు. తద్వారా పాల సేకరణ పెంపుకు కృషి చేయాలని చెప్పారు. అంతేకాకుండా గోపాలమిత్రల సేవలను వినియోగించుకొని పాల సేకరణను పెరిగేలా చూడాలని, వారికి అవసరమైన ప్రోత్సాహకాలు అందించే అంశాలను పరిశీలించాలని డెయిరీ ఎండీ శ్రీనివాస్ రావుకు సూచించారు. పాలసేకరణ పెంచేందుకు గోపాల మిత్రల సేవలను వినియోగించుకునేలా త్వరలో గోపాలమిత్రలతో ఒక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

విజయ డెయిరీ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించి ప్రైవేట్ డెయిరీలకు దీటుగా విక్రయాలు పెంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ జంట నగరాలలో పెద్ద ఎత్తున ఔట్ లెట్ లను ఏర్పాటు చేయడం ద్వారా విక్రయాలను పెంచవచ్చని అన్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా రాష్ట్రాన్ని 4 జోన్ లుగా విభజించి జోన్ కు ఒకరు చొప్పున ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని అన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఔట్ లెట్ లో విజయ ఉత్పత్తులతో పాటు విజయ ఐస్క్రీం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

అదే విధంగా జూపార్క్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యుజియం తదితర పర్యాటక ప్రాంతాలు, దేవాలయాల వద్ద విజయ డెయిరీ ఔట్ లెట్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు విజయ డెయిరీ ఉత్పత్తుల సరఫరా జరిగేలా చూడాలని, ప్రభుత్వపరంగా అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని అన్నారు.

More Press Releases