దౌర్జన్యంతో నెగ్గాలనుకుంటే ఎన్నికలు ఎందుకు..? పవన్ కల్యాణ్

Related image

  • ప్రజాస్వామ్యం అంటే వైసీపీకి గౌరవం లేదు

  • దౌర్జన్యాలతో గెలిచినా... ఆ గెలుపు నిలబడదు

  • ఏపీ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి హింసను చూడలేదు

  • వైసీపీ రౌడీయిజానికి ముక్కుతాడు వేయాల్సిన సమయం వచ్చింది

  • బీజేపీ, జనసేన పార్టీలు అభ్యర్ధులకు అండగా ఉంటాయి

  • ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోండి

  • బీజేపీ – జనసేన స్థానిక ఎన్నికల విజన్ డాక్యుమెంట్ విడుదల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

ప్రజాస్వామ్యం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు... అలాంటి గ్రామాల రూపురేఖలు మార్చే స్థానిక సంస్థల ఎన్నికలను బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలతో గెలవాలని చూస్తున్నారని అన్నారు. నామినేషన్లకే ఇంత బీభత్సం సృష్టిస్తే... రేపు పోలింగ్ సమయంలో ఎంత హింస సృష్టిస్తారోనని ప్రజలు భయపడుతున్నారన్నారు. అదుపు తప్పిన ఎద్దుకు ముక్కుతాడు వేసినట్లు... వైసీపీ రౌడీయిజానికి ముక్కుతాడు వేయాల్సిన సమయం వచ్చిందన్నారు. వైసీపీ ఎన్ని దౌర్జన్యాలు చేసి గెలిచినా అలాంటి గెలుపు ఎన్నటికీ నిలబడదని అన్నారు. గురువారం మధ్యాహ్నం విజయవాడలో బీజేపీ – జనసేన పార్టీలు సంయుక్తంగా స్థానిక సంస్థల విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశాయి.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించకుండా దాట వేస్తే... ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం, దాడులతో ఎన్నికలను ఏకపక్షం చేయాలని చూస్తోంది. యువతకు అవకాశం కల్పించాలని మేము ఒకవైపు ఆలోచిస్తుంటే... వీళ్లేమో నామినేషన్లు వేయలేని పరిస్థితి సృష్టిస్తున్నారు. దౌర్జన్యంతో నెగ్గాలనుకుంటే ఎలక్షన్లు ఎందుకు..? జగన్ రెడ్డి వారి అభ్యర్ధులను మాత్రమే నిలబెట్టుకొని ఏకగ్రీవం అని ప్రకటించుకోవచ్చుగా.

•ఏపీ మరో బీహార్ లా తయారైంది

ఈ మధ్య ఢిల్లీలో కొంతమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు వాళ్లు ఏపీ మరో బీహార్ రాష్ట్రంలా తయారవుతోంది అన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన నాయకులపై రాళ్ల దాడులు చేసి, నామినేషన్ పత్రాలను చించివేయడం, ప్రశాంత గోదావరి జిల్లాల్లో భూసేకరణ పేరుతో భూములు లాక్కొంటామని, బైండోవర్ కేసులు పెడతామని రైతులను బెదిరించడం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. నామినేషన్ల వేళ ఇంతటి హింసను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఎప్పుడు చూడలేదు. ఎక్కడో అడపాదడపా చిన్న చిన్న సంఘటనలు జరిగాయి తప్ప... 13 జిల్లాల్లో ఇప్పుడు ఏ మూలన చూసినా అరాచకాలే. ప్రశాంతమైన గోదావరి జిల్లాలకు కూడా రౌడీయిజం వచ్చేసింది. 

•కేంద్రం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం

పోలీసు అధికారులు, ఎలక్షన్ అధికారుల ముందే వేరే పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. కొంతమంది అధికారుల కళ్లెదుటే అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు. శేషన్ గారి లాంటి వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉంటే ఇలా జరిగేదా..? రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు తమ బాధ్యతలు గుర్తు చేసుకోవాలి. సామాన్యులకు అన్యాయం జరగకుండా బాధ్యత తీసుకోవాలి. ఎంపీటీసీ, జెడ్పీటీసీల నామినేషన్ల సందర్భంగా వైసీపీ చేసిన దౌర్జన్యాలను కేంద్రం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. దుర్గి మండలంలో అభ్యర్థులను పోలీస్ అధికారులే బెదిరిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ పక్షంలా వ్యవహరిస్తున్నారు.

•అభ్యర్ధులకు అండగా ఉంటాం

నేరపూరిత రాజకీయాలకు బీజేపీ, జనసేన పార్టీలు వ్యతిరేకం. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులు ధైర్యంగా గెలుపు కోసం పని చేయండి. మనం ఇవాళ వారి బెదిరింపులకు భయపడి ఆగిపోతే వాళ్లు గెలిచినవారవుతారు. దెబ్బలు తిన్నా ధైర్యంగా నిలబడి పోరాడి ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టండి. బీజేపీ, జనసేన పార్టీలు అండగా ఉంటాయి. అభ్యర్ధుల్లో ధైర్యం నింపడానికి అందరం అందుబాటులో ఉంటాం” అన్నారు. 

•నియంతృత్వానికి ఫ్యాక్షనిజం తోడయితే ఇంతే: కన్నా లక్ష్మీనారాయణ

నియంతృత్వానికి ఫ్యాక్షనిజం తోడయితే ఎలా ఉంటుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో కళ్లకు కడుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ “ఫ్యాక్షనిస్టులు టెండర్ ఫారాలు లాక్కెళ్లడం, చించివేయడం మనం చూశాం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నామినేషన్ ఫారాలు లాక్కెళ్లడం, చించివేయడం చూస్తున్నాం. నా 47 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి అకృత్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు నేను చూడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అసలు ఎన్నికలు జరపకుండా నామినేషన్ పద్ధతిలో పదవులు భర్తీ చేస్తే సరిపోయేదిగా? ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసమే ఈ ఎన్నికల తంతు అంతా. మీ ప్రాంతంలో గెలవకపోతే మీ ఉద్యోగాలు పోతాయని మంత్రులను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి బెదరించడమేమిటి? వారు రెచ్చిపోయి అరాచకాలు సృష్టించడమేమిటి? సాక్షాత్తు రిటర్నింగ్ అధికారుల సమక్షంలో కూడా నామినేషన్ పత్రాలను వైసీపీ గూండాలు చించివేశారు.

ఎన్నికల అధికారులకు, పోలీసు అధికారులకు చెప్పుకున్నా దిక్కులేదు. ఇవాళ స్క్రూటనీలో కూడా ఇష్టం వచ్చినట్లు నామినేషన్లను తిరస్కరిస్తున్నారని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. పాత ఓటరు లిస్టులో పేరు ఇలా ఉందే....కొత్త ఓటర్ లిస్టులో పేరు అలా లేదే అంటూ కుంటిసాకులు చెబుతూ అధికారులు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారు. నిన్న బూతులు తిడుతూ అభ్యర్థులను బెదిరించి మరీ నామినేషన్లు వేయకుండా చేసిన దుర్గి సబ్ ఇనస్పెక్టర్ ఈ రోజు విత్ డ్రా చేసుకోకపోతే అంతుచూస్తానని బెదిరిస్తున్నారు. శ్రీకాళహస్తి ఘటనలపై నిన్న నేను ఎస్.పి. కి ఫోన్ చేస్తే మా వాళ్లనే అరెస్టు చేశారు.

ఇదేంటని మళ్లీ అడిగితే మీరు చెప్పింది ఏర్పేడు గురించి కదా అని ఎస్.పి. అన్నారు. పరిస్థితి ఇలా ఉంది. నిన్న నెల్లూరులో కత్తిపోట్లు, ఇవాళ శ్రీకాళహస్తిలో కత్తిపోట్లు. ఎలక్షన్ కమిషన్ అధికారాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే జగన్ సర్కార్ మద్యం, డబ్బు పంచితే మూడేళ్లు జైలు శిక్ష అంటూ ఆర్డినెన్స్ తెచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఆర్డినెన్స్ కు మీ వాళ్లు కట్టుబడి మద్యం, డబ్బు పంచకుండా ఉంటారా? మీ వాళ్లు ఈ చర్యలకు పాల్పడితే మీరు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారా? ఈ అరాచకాలకు బ్రేక్ పడాలంటే బి.జె.పి., జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించండి. మేము ఈ అకృత్యాలను అడ్డుకుంటాం అని  పేర్కొన్నారు. 

•ప్రమాదంలో ప్రజాస్వామ్యం: సునీల్ డియోధర్

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బి.జె.పి. ఆంధ్రప్రదేశ్ ఇన్ ఛార్జి సునీల్ డియోధర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న హింస, రౌడీయిజం జగన్, ఆయన పార్టీ వాళ్ల నైజానికి అద్దం పడుతున్నాయి. చంద్రబాబు, జగన్ రెడ్డిలు నాగరాజు, సర్పరాజుల్లాంటివాళ్లు. వీళ్ళు రాష్ట్ర ప్రజల మీద విషం చిమ్ముతున్నారు.  నేను జగన్ కు ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. బురద నుంచే కమలం వికసిస్తుంది. మీరు హింసతో ఎంత బురద సృష్టిస్తే అన్ని కమలాలు వికసిస్తాయి. వైఎస్సార్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే అధికారం తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే అసలు వారు ఈ ఎన్నికలనే వద్దనుకున్నారు.

తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు దోచుకుంటే ఇప్పుడు గ్రామ వాలంటీర్లు ఆ పని కానిస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు ఉన్నది ఒకటే ప్రత్యామ్నాయం. బి.జె.పి., జనసేన కూటమి. దీనిని గెలిపించండి” అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రముఖ నాయకులు పురంధేశ్వరి, పాకా సత్యనారాయణ, సోము వీర్రాజు, మాధవ్, పైడికొండల మాణిక్యాలరావు, తురగా నాగభూషణం పాల్గొన్నారు. జనసేన పార్టీ తరపున రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పి. రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

More Press Releases