పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అధికారులతో మంత్రి తలసాని సమావేశం!

Related image

పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలపై శాఖల వారిగా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి సమగ్ర నివేదికను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల కార్యదర్శిగా బాద్యతలు చేపట్టిన అనిత రాజేంద్ర మంగళవారం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని చాంబర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా శాఖల వారిగా రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. అనంతరం జిల్లాల వారిగా శాఖలపై సమావేశాలు నిర్వహించి సమస్యలపై అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. గుర్తించిన సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను రూపొందింఛి అందజేయాలని ఆదేశించారు. తనకు నివేదికను సమర్పిస్తే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

15 రోజులలో అధికారులతో మరో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని అన్నారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రాష్ట్ర పర్యటన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలుసుకొని ఎంతో అభినందించారని అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలలో మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి కేంద్రమంత్రి వివరిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలతో రూపొందించి అమలు చేస్తున్న గొర్రెల పెంపకం దారులకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకం సత్పలితాలు ఇస్తుందని తెలిపారు.

2017 జూన్ లో ప్రారంభించిన ఈ పథకం క్రింద 76.92 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా వాటి వలన 70.88 పిల్లలు జన్మించాయని అన్నారు. వీటి విలువ సుమారు 3,189 కోట్ల రూపాయలుగా ఉంటుందని పేర్కొన్నారు. పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు పాడిగేదెల పంపిణీ చేయడం జరిగిందని, లీటర్ పాలకు 4 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. విజయ డెయిరీకి పాల సేకరణను పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా విజయ పాల ఉత్పత్తుల విక్రయాలను మరింతగా పెంచేందుకు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే పలు నూతన ఔట్ లెట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, మరిన్ని ఔట్ లెట్ ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆమెను ఆదేశించారు.

మత్స్యకారుల సంక్షేమం కోసం ఈ సంవత్సరం 64 కోట్ల చేపపిల్లలు, 3.5 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను ఉచితంగా అన్ని నీటి వనరులలో విడుదల చేయడం జరిగిందని అన్నారు. మత్స్య సంపదను విక్రయించుకోవడానికి మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, వలలు ఇచ్చినట్లు తెలిపారు. చేపల కోసం సుదూర ప్రాంతాలలోని చేపల మార్కెట్ లకు ప్రజలు వెళుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజల వద్దకే వెళ్ళి చేపలు విక్రయించేలా త్వరలో నగరంలోని 150 డివిజన్ లలో డివిజన్ కు ఒకటి చొప్పున మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల నగరంలోని NTR స్టేడియంలో నిర్వహించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు విశేష స్పందన వచ్చిందని, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఇలాంటి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్ ను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, TSLDA  CEO మంజువాణి, పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, డెయిరీ అధికారులు మల్లయ్య, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases