‘హే చికీతా’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను : సి. కళ్యాణ్

‘హే చికీతా’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను : సి. కళ్యాణ్
అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. ఈ మూవీకి ధన్ రాజ్ లెక్కల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయి కుషి ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని జూలై 24న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, జి. నాగేశ్వర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌‌కి ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, రామసత్య నారాయణ, ప్రముఖ దర్శకులు నాగేశ్వర్ రెడ్డి, దశరథ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

సి. కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘అంజి నా శిష్యుడు. అతనికి మంచి టాలెంట్ ఉంది. మా ప్రభాకర్ కూతురు దివిజకు మంచి విజయాలు దక్కాలి. నిర్మాతగా అశోక్‌ని తెలుగులోకి తీసుకు వస్తుండటం ఆనందంగా ఉంది. టీజర్ నాకు చాలా నచ్చింది. ఇందులో హార్ట్ టచింగ్ సాంగ్స్ ఉన్నాయి. అంజి పక్కన ఉన్నాడు కాబట్టి దర్శకుడు సినిమాని బాగానే తీసి ఉంటారు. దివిజను చూస్తుంటే మా ఇంటి నుంచే హీరోయిన్‌గా వస్తున్నట్టుంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రభాకర్ మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇంత మంచి గెస్టులు రావడం చూస్తుంటే ఇక్కడే సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది. ధన్ రాజ్ ఈ కథను చెప్పినప్పుడు ఫస్ట్ హాఫ్‌లో సీన్స్ విని పడి పడి నవ్వుకుని చాలా ఎంజాయ్ చేశాం. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, దశరథ్ లాంటి దర్శకులంతా మా ధన్ రాజ్‌లో ఉన్నాడు. ఈ కథే ఈ చిత్రానికి హీరో. రైతే రాజు అనే కాన్సెప్ట్, పవనిజంకి చాలా లింక్ ఉంటుంది. ఇలాంటి ఓ కథను అన్ని వర్గాల ఆడియెన్స్‌ని మెప్పించేలా ధన్ రాజ్ రాసుకున్నాడు. మన మధ్య, మన చుట్టూ జరిగే కథలు ఈ మధ్య రావడం లేదు. ఇలాంటి రియలిస్టిక్ చిత్రాల్ని ఆదరించాలి. ధన్ రాజ్ తన ఊర్లో జరిగిన ఘటనల్ని అల్లుకుని ఈ కథను రాసుకున్నారు. చరణ్ అర్జున్ పాటలు గొప్పగా ఉంటాయి. ఇందులో నటించిన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ గొప్పోడే. అంజి గారి వర్క్ చూసి ఆశ్చర్యపోయాను. ఎక్కడా ఒక్క రూపాయి వృథా కాకుండా షూట్ చేశారు. సింగిల్ షెడ్యూల్‌లో ఈ మూవీ పూర్తి చేశారు. ఇందులో నేను ఒక మంచి పాత్రను పోషించాను. దివిజ తన పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అయింది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ .. ‘అంజి గారి వల్లే నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన అశోక్ గారికి థాంక్స్. నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఊర్లో ఉండే ఓ ఐదుగురు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారు అన్నది ఈ సినిమా కథ. అందుకే ‘హే చికీతా’ అనే టైటిల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ప్రతీ సినిమాలో ఇంట్రో సాంగ్‌లో మూడు నిమిషాల పాటు సందేశాన్ని ఇస్తారు. నేను అదే లైన్‌తో రైతుల గురించి మూడు గంటల పాటు సినిమా తీశాను. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి కథను రాసుకున్నాను. దివిజ, అభినవ్ చక్కగా నటించారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ థాంక్స్. మా అన్న చరణ్ అర్జున్ నాకెప్పుడూ సపోర్ట్‌గా ఉంటారు. ఆయన సంగీతం గురించి సినిమా చూసిన తరువాత ప్రేక్షకులే మాట్లాడతారు. రైతుల గురించి మాట్లాడే, ఆలోచించే ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు.

హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ను అంజి గారి వల్లే చేశాం. చరణ్ అర్జున్ గారి వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. నిర్మాతగా, డీఓపీగా అంజి గారి కష్టాన్ని మేం చూశాం. అశోక్ గారు మా వెన్నంటే నిల్చున్నారు. ధన్ రాజ్ లెక్కలకు మంచి టాలెంట్ ఉంది. ధన్ రాజ్ తన ఊరి కథను అందరికీ చెప్పాలని, తన ఊర్లోనే షూటింగ్ చేశారు. ప్రస్తుతం దివిజ టైం నడుస్తోంది. టైటిల్‌కి న్యాయం చేసేలా కథ ఉంటుంది. సింగిల్ షెడ్యూల్‌లోనే రాత్రిపగలు కష్టపడి కంప్లీట్ చేశాం. మా మూవీని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

దివిజ ప్రభాకర్ మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అంజి గారు, అశోక్ గారు మాకు అండగా నిలిచారు. సింగిల్ షెడ్యూల్‌లో కేవలం 21 రోజుల్లోనే షూటింగ్ ఫినిష్ చేశాం. ధన్ రాజ్ లెక్కల గారికి అద్భుతమైన టాలెంట్ ఉంది. చిట్టి పాత్రను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. చరణ్ అర్జున్ గారి సంగీతంలో నేను పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. మేమంతా కష్టపడి ఈ మూవీని చేశాం. మా సినిమాని జూలై 24న రిలీజ్ చేయబోతోన్నాం. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నిర్మాత గరుడవేగ అంజి మాట్లాడుతూ .. ‘కొత్త కథల్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ బ్యానర్లను ప్రారంభించాం. మా ఆధ్వర్యంలో మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. ‘హే చికీతా’ అద్భుతంగా వచ్చింది. మేం ఎంతో మంది గొప్ప దర్శకుల్ని, ఆర్టిస్టుల్ని పరిచయం చేయాలని అనుకుంటున్నాం. అశోక్ గారు ఎక్కువగా మాట్లాడరు. జూలై 24న మా సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నాం. కంటెంట్ ఉంటే డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు, ఆడియెన్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. మా కోసం వచ్చిన ప్రతీ ఒక్క గెస్ట్‌కి థాంక్స్.  మా సినిమాని మీడియా ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ మూవీని ఆల్రెడీ చూశాను. చాలా బాగుంది. చరణ్ అర్జున్ పాటలు అందరినీ కట్టి పడేస్తాయి. ధన్ రాజ్‌కి తెలంగాణ ప్రాంతం మీద చాలా పట్టుంది. అదే మనకు తెరపై కనిపిస్తుంది. ఇలాంటి ఓ కొత్త ప్రయత్నం, చిన్న ప్రయత్నంని ఆశీర్వదించేందుకు జనాలు వస్తారా? లేదా? అన్న అనుమానం ఉంది. ఈ చిత్రం అంతా కూడా పవనిజం మీద నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఆరా, ఆయన ఫ్యాన్స్‌కి నచ్చేలా, మెచ్చేలా ఉంటుంది. ఆయన అభిమానులే ఈ మూవీని పెద్ద సక్సెస్ చేస్తారు’ అని అన్నారు.

ప్రముఖ దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ చిత్రాన్ని ధన్ రాజ్ అద్భుతంగా తెరకెక్కించారు. దివిజ, అభినవ్ చాలా అద్భుతంగా నటించారు. చరణ్ అర్జున్ ఇచ్చిన మూడు పాటలు గొప్పగా ఉన్నాయి. అంజి విజువల్స్ బాగున్నాయి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
 
Hyy Chikittha
C Kalyan
Garudavega Anji
KK Senthil Kumar

Watch Today's Deals on Amazon

More Press News