తెలంగాణ దివ్యాంగులకు శుభవార్త.. ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు!

తెలంగాణ దివ్యాంగులకు శుభవార్త.. ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు!
తెలంగాణలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా వారికి ఉచితంగా పలు రకాల ఉపకరణాలను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు, బ్యాటరీ వీల్‌చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, 5జీ స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 10, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు OBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసి అవకాశం రాని వారు కూడా ఈసారి మళ్లీ అప్లై చేసుకోవచ్చని కార్పొరేషన్ స్పష్టం చేసింది. దివ్యాంగులు స్వయం ఉపాధి, విద్య, ఉద్యోగావకాశాల్లో రాణించేందుకు ఈ ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఏయే పరికరాలకు ఎవరు అర్హులు?
  • బ్యాటరీ వీల్‌చైర్లు: 80% శారీరక వైకల్యం లేదా మస్క్యులర్ డిస్ట్రోఫీ, స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ (40% వైకల్యం) సమస్యలు ఉన్న 12 నుంచి 55 ఏళ్లలోపు వారు అర్హులు. 
  • మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్: చిరు వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా వీటిని అందిస్తున్నారు. 40% శారీరక వైకల్యం ఉన్న 18 నుంచి 55 ఏళ్లలోపు వారు, చదువుతో నిమిత్తం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ల్యాప్‌టాప్‌లు: డిగ్రీ, పీజీ, ఆపై చదువులు చదివే శారీరక, దృష్టి, వినికిడి లోపం ఉన్న విద్యార్థులు తమ అర్హతలను బట్టి లో-ఎండ్, హై-ఎండ్ ల్యాప్‌టాప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ట్యాబ్‌లు, 5జీ స్మార్ట్‌ఫోన్లు: ఇంటర్, పదో తరగతి చదువుతున్న లేదా పూర్తి చేసిన దృష్టి, వినికిడి లోపం ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు వయసు, వైకల్య శాతం ఆధారంగా వీటికి అర్హులు.

దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే, చైర్మన్ కార్యాలయం ఇన్‌చార్జి రజినిని 9959583502 నంబర్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సంప్రదించవచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
differently abled

More Press News