ధాన్యం అమ్మిన 48 గంటల్లో డబ్బులిస్తామన్నారు... వారాలు గడిచినా ఇవ్వట్లేదు: పవన్ కల్యాణ్

Related image

*   రైతులకు రూ. 2016 కోట్లు సర్కారు బాకీపడింది

'ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. పంట అమ్ముకొని వారాలు గడుస్తున్నా ఇప్పటికీ సొమ్ములు రాక రైతులు ఇబ్బందులు పాలవుతున్నారు. రైతు సంక్షేమం, భరోసా అంటూ ఎన్నికల సమయంలో వాగ్ధానాలు చేసి పాలనలోకి వచ్చాక బకాయిలు కూడా చెల్లించడం లేదు. ధాన్యం అమ్మిన రైతులకు ఈ రోజుకి రూ.2016 కోట్లు మేర  చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. లక్ష మందికిపైగా రైతులు తాము అమ్మిన పంటకు రావాల్సిన డబ్బులు కోసం ఎదురు చూస్తున్నారు. రెండో పంటకు అవసరమైన పెట్టుబడికి డబ్బులు లేక రైతాంగం ఇబ్బందులుపడుతుంటే సంబంధిత శాఖలు ఏమి చేస్తున్నాయి? ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దిగుబడి అమ్ముకున్న రైతులకు సొమ్ములు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి. తాము అమ్మిన పంటకు రావాల్సిన డబ్బుల గురించి అడుగుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి సమాధానం కూడా రాకపోవడం పాలకుల బాధ్యతారాహిత్యాన్ని తెలియచేస్తోంది. కొనుగోలు చేసిన 48 గంటల్లో పంట డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మరచిపోయింది. ధాన్యం అమ్మిన నెల రోజులకి కూడా సొమ్ము చేతికి రాక, రెండో పంటకు పెట్టుబడి లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఖరీఫ్ పంట కొనుగోలు, సొమ్ముల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ప్రణాళిక లేకుండా, ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో డిసెంబర్ నెలలోనే రైతు సౌభాగ్య దీక్ష ద్వారా వెల్లడించాం. ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా? కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో రైతాంగానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.'అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

More Press Releases