పంజాబ్ దేశ్ భగత్ విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న ఏపీ గవర్నర్

పంజాబ్ దేశ్ భగత్ విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిస్వ భూషన్ హరిచందన్‌ గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. పంజాబ్‌లోని దేశ్ భగత్ విశ్వవిద్యాలయ 7వ స్నాతకోత్సవం సందర్భంగా విశ్వ విద్యాలయ కులపతి డాక్టర్ జోరా సింగ్ గౌరవ గవర్నర్ కు డాక్టరేట్ ప్రదానంను చేసారు. సామాజిక శాస్త్ర విభాగంలో బిశ్వ భూషణ్ దేశానికి చేసిన అసాధారణ కృషి, సేవలకు గుర్తింపుగా దేశ్ భగత్ విశ్వవిద్యాలయం ఈ ప్రత్యేక గుర్తింపును అందించింది. శుక్రవారం పంజాబ్ లోని విశ్వ విద్యాలయ ఆవరణలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విద్యార్ధులు, మేధావుల కళాతర ధ్వనుల మధ్య డాక్టరేట్ ను స్వీకరించారు. శ్రీ హరిచందన్ విభిన్న రంగాలలో తన పరిణితిని ప్రదర్శిస్తూ వచ్చారు, ఒక వైపు కవి పండితునిగా, మరోవైపు న్యాయవాదిగా రాణిస్తూనే రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రను చూపగలిగారు.

ఒడియాలో ప్రఖ్యాత రచయితగా గుర్తింపు పొందుతూ విభిన్న అంశాలపై అనేక పుస్తకాలను రచించటమే కాక,  ప్రజలకు రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించడంలో నిరంతరం నిమగ్నమై ఉన్నారు. 1961 లో శ్రీ హరిచందన్ న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. శాసనసభ్యునిగా ఐదు సార్లు విజయం సాధించిన హరిచందన్, వరుసగా మూడు సార్లు జయ కేతనం ఎగురవేయటం విశేషం. తన పదవీ కాలంలో విలువలతో కూడిన రాజకీయం చేస్తూ, ఒడిస్సా అభివృద్ది విశేష కృషి చేయగా,  2004 లో కేబినెట్ మంత్రిగా కూడా రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి పునరంకితం అయ్యారు. విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు స్నాతకోత్సవ ముఖ్య అతిథిగా హాజరైన బిశ్వ భూషణ్ హరిందన్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత తమ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తెరిగి వ్యవహరించాలన్నారు.  దేశం కోసం తామేమి చేయగలుగుతున్నామన్న దానిపై సమాలోచించాలన్నారు.

దేశ అభివృద్దిలో తమ వంతు భాగస్వామ్యం ఉండేలా ప్రయత్నించాలని అకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అప్రమత్తత తప్పనసరి విషయంగా మారిందని, ప్రతి విద్యార్ధి మొక్కల పెంపకం పట్ల ఆసక్తి చూపాలన్నారు. కార్యక్రమం తదుపరి గవర్నర్ శ్రీ హరిచందన్ చంఢీఘర్ సమీపంలోని ఫతేఘర్ సాహెబ్ గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఆశీర్వచనం అందుకున్నారు. ఒడిస్పా, పంజాబ్ పర్యటనలను ముగించుకుని శుక్రవారం పొద్దుపోయాక గవర్నర్ విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షునిగా కూడా వ్యవహరించే గవర్నర్ శనివారం సంస్ధ తరుపున చేపడుతున్న రక్తదాన ప్రమాణ పత్ర సేకరణ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎనిమిది గంటల వ్యవధిలో ఇరవైవేల మంది రక్తదాన ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయనుండగా,  ఈ వినూత్న కార్యక్రమం గిన్నీస్ రికార్డుగా నమోదు అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 
Biswabhusan Harichandan
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News