డాలస్ లో అంగరంగవైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు

డాలస్ లో అంగరంగవైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు
డాలస్, టెక్సాస్: దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నటసమ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినమైన సెప్టెంబర్ 20న డాలస్ నగరం (యాలెన్, రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియం) లో క్రిక్కిరిసిన అక్కినేని అభిమానులందరి మధ్య అక్కినేని శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, పూర్వాధ్యక్షులు రవి కొండబోలు, రావు కల్వాల, శారద ఆకునూరి, చలపతిరావు కొండ్రకుంట, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ధామ భక్తవత్సలు వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఎ.ఎఫ్.ఎ ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం అందరికీ స్వాగతం పలికి డా. అక్కినేనితో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని, గత పది సంవత్సరాలగా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను సోదాహరణంగా వివరించారు.

ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ సినదర్శకులు వి.ఎన్ ఆదిత్య డా. అక్కినేనికి తొలిసారి తాను రాసుకున్న సినిమాకథను వినిపించడం, ఆయన కథ విని ఇచ్చిన సలహాలు, తన జీవితాంతం పాటించే విలువైన అంశాలు అన్నారు. విశిష్టఅతిథిగా పాల్గొన్న తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ఛైర్మన్ మోహన్ శ్యాం ప్రసాద్ మునగాల మాట్లాడుతూ స్వయంకృషితో ఎవ్వరూ ఊహించని ఎత్తుకు ఎదిగిన ఎ.ఎన్.ఆర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు.

ప్రత్యేక అతిథులుగా హాజరైన పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్, అచ్చతెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ లు డా. అక్కినేనితో తమ అనుభవాలను పంచుకుంటూ ఆయన పెద్దగా చదువుకోలేక పోయినప్పటికీ ఆయన చేసిన విద్యాదానం ద్వారా ఎంతోమంది విద్యావంతులను సృష్టించిన మేధావి అక్కినేని అంటూ కొనియాడారు.
ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు, ఎ.ఎన్.ఆర్ కళాశాల, గుడివాడ పూర్వవిద్యార్ధి అయిన కిషోర్ కంచర్ల తన కళాశాల అనుభవాలను పంచుకున్నారు.

అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి ఆధ్వర్యంలో ‘సినీ విజ్ఞాన విశారద’ ఎస్.వి రామారావు రచించిన “అక్కినేని ఆణిముత్యాలు” (అక్కినేని శతజయంతి – శతచిత్ర విశేషాలు) అనే గ్రంథాన్ని వి.ఎన్ ఆదిత్య ఆవిష్కరించారు. అక్కినేని శతజయంతి సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను మోహన్ శ్యాం ప్రసాద్ ఆవిష్కరించి తొలిప్రతిని అవధాని డా. పాలపర్తికి అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబసభ్యులు అక్కినేని నాగార్జున, వెంకట్, నాగసుశీల, సుమంత్, సుశాంత్ లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు విజయవంతం కావాలని శుభాకాంక్షలు అందజేసిన విడియో సందేశాలను ప్రదర్శించారు.
అక్కినేని చిత్రాలలోని కొన్ని పాటలకు స్త్రీ వేషధారణలో నృత్యంచేసిన పురుషుడు చంద్రశేఖర్ రెడ్డి లోకా, రషీద్ ల జంట అందరినీ ఆకట్టుకుంది. అక్కినేని చిత్ర గీతాంజలి పేరిట మాయాబజార్, దొంగరాముడు, మాంగల్య బలం, ఆత్మీయులు, అనార్కలి, సుమంగళి, కులగోత్రాలు, ఆత్మబలం, శ్రీ రామదాసు, మనసు మాంగల్యం, రావణుడే రాముడైతే, ఇద్దరు మిత్రులు, పెళ్లి కానుక, ఏడంతస్తుల మేడ, ఆలుమగలు, ప్రేమ మందిరం, డాక్టర్ చక్రవర్తి, గాండీవం మొదలైన చిత్రాలనుండి అనేక మధురమైన గీతాలను శారద ఆకునూరి, చంద్రహాస్ మద్దుకూరి, రవి తూపురాని, నాగి పార్థసారథి, శ్రీకాంత్ లంకా, జయకళ్యాణి, సృజన ఆదూరి బృందం శ్రావ్యంగా పాడి అందరినీ అలరించారు.

అక్కినేని శతజయంతి ప్రత్యేక సంచికను రూపకల్పనచేసి, తీర్చిదిద్దడంలో ఎంతో సమయాన్ని వెచ్చించిన కమిటీ సమన్వయకర్త సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, లెనిన్ బాబు వేముల మరియు దయాకర్ మాడలను పాల్గొన్న అతిథులందరినీ, నృత్య కళాకారులను, గాయనీ గాయకులను ఎ.ఎఫ్.ఎ బోర్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.
అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “డా. అక్కినేనిలో ఉన్న నటనకన్నా ఆయనలోని విశిష్ట లక్షణాలను అధ్యయనంచేసి అనుసరించ వలసినవి, ఏ రంగంలో ఉన్నవారికైనా ఉపయోగపడేవి ఎన్నో ఉన్నాయన్నారు.”

శారద ఆకునూరి తన వందనసమర్పణలో షడ్రుచుల విందు భోజనం అందించిన బావర్చి రెస్టారెంట్ యజమాని, ఈ కార్యక్రమ ముఖ్యపోషకులు అయిన కిషోర్ కంచర్ల, మంచి వేదికను కల్పించిన రాధాకృష్ణ టెంపుల్ యాజమాన్యానికి, వీడియో, ఆడియో, ఫోటోగ్రఫీ సహకారం అందించిన వారికి, కార్యకర్తలకు ఎఎఫ్ఎ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Akkineni
USA
Dallas
India
Akkineni Nageswara Rao
Prasad Thotakura
Murali Vennam

More Press News