జనసేన లక్ష్యం తప్పకుండా సాధిస్తాం: పవన్ కల్యాణ్

Related image

  • నేనెవరికీ గులాంగిరీ చేయను... ఆత్మగౌరవంతో ముందుకు వెళ్తాను • 
  • వర్జీనియాలో ప్రవాసాంధ్ర జనసేన అభిమానుల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు
గెలుపు వస్తే పొంగిపోయి ఓటమి ఎదురైతే కుంగిపోయే వ్య‌క్తిని కాద‌ని, రెండింటిని స‌మానంగా తీసుకొని ముందుకు ప్ర‌యాణించే వ్య‌క్తిన‌ని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు పేర్కొన్నారు. భూమిలో పాతిపెట్టిన చిన్న‌ విత్తే మొల‌కెత్త‌డానికి అనేక క‌ష్టాలుప‌డితే... కోట్లాదిమంది భ‌విష్య‌త్తు నిర్దేశించే రాజ‌కీయ పార్టీ న‌డ‌పాలంటే చాలా క‌ష్టాలు అనుభ‌వించాల‌న్నారు. అమెరికాలోని వర్జీనియా నగరంలో ప్రవాసాంధ్రులైన జనసేన అభిమానులునిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రసంగిస్తూ “దెబ్బ‌లు తిన్నా, ఓట‌మి చెందినా ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌ని మొద‌లుపెట్టిన నా ప్ర‌యాణం ఆగదు. ఒక్క అప‌జ‌యం న‌న్ను వెనక్కి లాగేయలేదు. డ‌బ్బుతో ముడిప‌డిన రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవాలంటే చాలా క‌ష్టం. కోట్లాదిమంది భ‌విష్య‌త్తును నిర్దేశించాలంటే అనుభ‌వం కావాలి. అందుకే పార్టీ స్థాపించిన‌ప్పుడే చెప్పాను ఇది పాతికేళ్ల ప్రయాణం అని. సుదీర్ఘ‌మైన ప్ర‌ణాళిక, లోతైన ఆలోచ‌న‌తో జ‌న‌సేన పార్టీని స్థాపించాను. 25 ఏళ్లు ప్ర‌యాణించాలంటే చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవాలి. 2024 వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ ఉంటుందా అని కొంద‌రు అడుగుతున్నారు.. వాళ్ల‌కు నేను ఒక‌టే చెప్పాల‌నుకుంటున్నాను నా మొద‌టి సినిమా విజ‌యం సాధించ‌న‌ప్పుడు భ‌విష్య‌త్తులో ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని పొందుతాన‌ని ఎవ‌రైనా ఊహించారా..?. జ‌న‌సేన పార్టీ కూడా అంతే. గెలుపోట‌ములు స‌మానంగా తీసుకుని ముందుకు ప్ర‌యాణం చేయ‌డ‌మే నాకు తెలుసు. • మన భాషను... సంస్కృతిని కాపాడుతున్నారు దేశం కాని దేశం వ‌చ్చి పారిశ్రామిక‌వేత్త‌లు, డాక్ట‌ర్లు, ఇంజ‌నీర్లుగా రాణిస్తున్నారు. మంచి లైఫ్‌, అవ‌కాశాలు బాగుంటాయ‌ని స‌ముద్రాలు దాటి ఇంత‌ దూరం వ‌చ్చారు. ఇలాంటి ప‌రిస్థితుల‌ను మ‌న‌ దేశంలో క‌ల్పించాల‌నేదే నా కోరిక‌. దాని కోసం ఎన్ని ఎదురు దెబ్బ‌లైనా, క‌ష్టాలైనా అనుభ‌విస్తాను. దానిని సాధించేందుకు నా వంతు కృషి చేస్తాను. ప‌ది మందికి ఉపాధి క‌ల్పించాల‌నే స‌దుద్దేశంతో పెట్టుబ‌డులు పెట్టాలన్నా... అందుకు అనుకూల‌మైన ప‌రిస్థితులు మ‌న‌దేశంలో లేవు. దానిని మార్చాల‌న్న‌దే నా తాప‌త్ర‌యం. అస‌లు ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌క‌పోతే మార్పు అనేది సాధ్యం కాదు. దేశం కానీ దేశంలో ఉంటూ మ‌న‌దేశం కోసం ఆలోచిస్తున్నారు. అందుకే మీ ద‌గ్గ‌ర మ‌న‌సు విప్పి మాట్లాడాలి అనిపించింది. భారతదేశం నుంచి, మన సంస్కృతి నించి బయటకు వచ్చాక మన ఇంటి విలువ, మన మట్టి విలువ తెలుసుకొంటున్నారు. సముద్రాలు దాటి వచ్చినా మన భాషను, సంస్కృతిని గొప్పగా మీరు కాపాడుతున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు చేసిన రచనలు ప్రింట్లో దొరకడం లేదని వాటిని ప్రింట్ చేయించి అందుబాటులోకి తెచ్చింది అమెరికా వచ్చి స్థిరపడ్డ తెలుగువారే. వీరంతా చాలా చక్కగా మన భాషను మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది. విజ‌యం సాధించినప్పుడు జై కొట్ట‌డం, క‌ల‌వ‌డానికి ఉత్సాహం చూపడం ప‌రిపాటే. ఓట‌మి చెందిన త‌ర్వాత కూడా న‌న్ను క‌ల‌వ‌డానికి చాలా దూరం నుంచి వ‌చ్చిన మిమ్మ‌ల్ని చూస్తుంటే మ‌న‌సు క‌దిలిపోతుంది.

• ఓటు అమ్మకం నష్టం ఇప్పుడు తెలియకపోవచ్చు ఎంతోమంది మహానుభావులు మేధోమ‌థనం చేసి రాజ్యాంగం రూప‌క‌ల్ప‌న చేస్తే.. కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు ప‌ద్ద‌తి పాడు లేకుండా రాజ్యాంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారు. ఓటు అమ్ముకునే దుస్థితికి దేశం దిగ‌జారిపోయింది. ఓటు అమ్ముకుంటే జ‌రిగే న‌ష్టం ఇప్పుడు తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ బిడ్డ‌ల భ‌విష్య‌త్తుకు చాలా గట్టి దెబ్బ త‌గులుతుంది. ఇవ‌న్ని చెబితే వెట‌కారాలు చేస్తారు. కానీ కొన్ని రోజుల‌కు మ‌నం చెప్పిందే నిజ‌మ‌ని న‌మ్మి మ‌న వెంట న‌డుస్తారు. ఓడిపోయిన తరవాత ఎంత పర్సెంటేజ్ ఓటు వచ్చింది అని అడిగితే ఏడు నుంచి ఎనిమిది శాతం అని చెప్పారు... అంటే లక్షల మంది మనల్ని గుర్తించారు అన్నాను. వారికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు వెళ్దామని చెప్పి పార్టీ కార్యకలాపాల్లోకి వెళ్లిపోయాను. నేను గులాంగిరీ చేసి బతకలేను...ఆత్మగౌరవంతో వెళ్తాను. అందరి ఆత్మగౌరవం నిల్పాలి. అది లభించని చోట వజ్రాలు ఇచ్చినా ఉండను. వాటిని కింద పడేసి వెళ్లిపోతాను. రాష్ట్రం విడిపోయాక చాలా బాధ్యతగా ఉండాలి. అక్కడ వ్యక్తిగత రాజకీయ లబ్ధి కాదు... ప్రజల గురించి ఆలోచించాలి అని భాగస్వామ్యపక్షాలకు చెప్పాను. మార్పు కోసం వచ్చినవాడిని. నా స్వీయ రాజకీయ లబ్ధి చూసుకొనేవాడినే అయితే బీజేపీ, టీడీపీతో గొడవపెట్టుకోను. గెలిచే సీట్లు తీసుకొని వారితో కలిసేవాడిని. ఇందులో నా ప్రయోజనం ఉండదు. నేను ఓడిపోయినా అదో అవమానంగా భావించలేదు. గెలవలేకపోవచ్చు... కానే చిత్తశుద్ధితో బలమైన పోరాటం చేశాను. పని చేసినవాళ్ళకి పిలిచి టికెట్ ఇచ్చాను. అవమానం ఎందుకు ఉండాలి... వేల కోట్లు దోచేసి, అక్రమాలు చేసి... ఆ తరవాత జైల్లో పెడతారనుకొనేవాళ్ళకి ఓటమి అంటే భయం. క్షణికమైన భావోద్వేగాలు, కారణాలు, ఎన్నికలప్పుడు ఇచ్చిన డబ్బులో, ఇతర ఒత్తిళ్ళకో లోబడి అటువైపు కొందరు వెళ్ళిపోయినా... జనసేన పట్ల నిజమైన అభిమానం ఉన్నవారు అలాగే నిలబడ్డారు. • ధైర్యంగా ముందుకే ఈ ఎన్నికల్లో వైరిపక్షాలు వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయి. అలాంటి రాజకీయ పద్మవ్యూహంలోకి వెళ్ళి క్షేమంగా వచ్చింది జనసేన పార్టీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఓ 20 రోజుల తరవాత నేను విజయవాడలో ఉండగా కేరళ నుంచి వచ్చిన ఓ ఐ.ఏ.ఎస్. అధికారి నన్ను కలిశారు. ‘మీరు ఏ విధానాల గురించి, పబ్లిక్ పాలసీల గురించి ఆలోచిస్తున్నారో అవి కేరళలో ఉన్నాయి.. ఒకసారి వచ్చి చూడండి... ఇప్పుడు వచ్చిన ఫలితం గురించి నిరాశ చెందవద్దు. మీ విధానాలు బాగున్నాయి’ అని చెప్పారు. అడుగడుగునా పరాజయం వెనక్కి వెళ్లిపోమని బెదిరిస్తుంది... కానీ ధైర్యంతో ముందుకే వెళ్దాం. అపజయం అనేది వ్యర్థాలను తొలగించుకొంటూ విజయం దిశగా వెళ్ళే ప్రక్రియలో భాగం. ఓటమి లేదు.. మజిలీయే ఉంది. ఒక గమ్యం నుంచి మరో గమ్యానికి వెళ్తాను. జనసేన లక్ష్యం కచ్చితంగా సాధిద్దాం” అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ముఖ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ శేఖర్ పులి పాల్గొన్నారు.

More Press Releases