‘కలియుగం పట్టణంలో’ కొత్త పాయింట్‌తో రాబోతోంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్

Related image

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నిర్వహించారు. ఈ మేరకు ఈవెంట్‌లో

 రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఆ నలుగురు సినిమాలో విశ్వ కార్తికేయ నటించాడు. అప్పడాలు అమ్మి పెట్టడంలో నా గురువుగా ఆరేళ్ల వయసులోనే విశ్వ కార్తికేయ నాతో పాటు నటించాడు. ఇప్పుడు హీరోగా నటించాడు. కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. కలియుగం పట్టణంలో అనే టైటిలే కొత్తగా ఉంది. ఈ నిర్మాతలు నాకు పాత మిత్రులు. కష్టపడి పని చేస్తుంటే ఎప్పుడూ అవకాశాలు వస్తుంటాయి. నేను ప్రాజెక్ట్ కేలో నటిస్తున్నాను. మహేష్ బాబు సినిమాలో నటించాను. ఈ చిత్రయూనిట్ కూడా కష్టపడి పని చేసి ఉంటుందని భావిస్తున్నాను. మార్చి 22న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

 నిర్మాత డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను సినిమా పరిశ్రమకు కొత్త. మా మామ నీలకంఠం గారిని సినిమాల గురించి ఎప్పుడూ అడుగుతుండేవాడిని. నాకు మూడు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. అక్కడ విద్యార్థులకు చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌ను బయటకు తీసుకు రావాలని, నా విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నాని మూవీ వర్క్స్ అనే బ్యానర్‌ను పెట్టాను. రమాకాంత్ నా టీంకు కథను చెప్పారు. మూడు, నాలుగు నెలల్లోనే సినిమా స్టార్ట్ చేశారు. రెండున్నర గంటలు అద్భుతంగా కథ చెప్పాడు. ప్రతీ సీన్ నా మైండ్‌లోకి ఎక్కించేశాడు. సినిమాల్లోకి దిగాలా? లేదా? నిర్మాతగా సాహసం చేస్తున్నానా? అని అనిపించింది. నాది ఒక షేర్ వేసుకో అని దర్శకుడికి చెప్పా. షూటింగ్ మాత్రం కడపలో చేయాలని కండీషన్ పెట్టాను. నా ఊరి జనాలకు ఏదో ఒక మేలు చేయాలనే ఉద్దేశంలోనే సినిమా రంగంలోకి వచ్చాను. ఇక్కడే ఉండి సంపాదించాలనే ఉద్దేశంతో అయితే సినిమాలు తీయడం లేదు. అజయ్ మ్యూజిక్, చంద్రబోస్, భాస్కర భట్ల పాటలు అద్భుతంగా వచ్చాయి. టీజర్, ట్రైలర్‌లను చూసి మా సినిమా కథను అంచనా వేయలేరు. ఈ స్టోరీ అంత కొత్తగా ఉంటుంది. మార్చి 22న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.

 డైరెక్టర్ నీలకంఠ రెడ్డి మాట్లాడుతూ.. ‘చంద్ర ఓబుల్ రెడ్డిగా మీకు తెలుసు. నానిగా నాకు తెలుసు. కడప నుంచి మంచి నిర్మాత రాబోతోన్నాడు. నాని ప్రతీ పనిని ప్యాషన్‌తో చేస్తుంటాడు. మామా.. సినిమా తీస్తున్నా అని నాతో సడెన్‌గా చెప్పడంతో షాక్ అయ్యాను. ప్రతీ విషయాన్ని తెలుసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాడు. పోస్టర్, టీజర్ ఇవన్నీ చూస్తుంటే సినిమాను బాగా తీశారనిపిస్తోంది. విశ్వ కార్తికేయ, ఆయుషి, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. సినిమా అంతా కూడా కడపలోనే తీయడం ఇదే మొదటి సారి. రమాకాంత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. మార్చి 22న ఈ మూవీ రాబోతోంది. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

 డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. ‘కలియుగం పట్టణంలో టీజర్ నాకు చూపించారు. నాకు చాలా నచ్చింది. ఏదో చిన్న సినిమాలా అనుకున్నా.. కానీ హై స్టాండర్డ్‌లా అనిపించింది. నీలకంఠ రెడ్డి గారు నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ఆయన దగ్గర పని చేసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. ఆయనంటే నాకు ఎప్పుడూ గౌరవమే. విశ్వ కార్తికేయ, ఆయుషి జంట చక్కగా ఉంది. ఈ చిత్రం పెద్ద హిట్ ఇవ్వాలి. దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలి.’ అని అన్నారు.

 డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా కలియుగం పట్టణంలో సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మీడియాకు థాంక్స్. నా సినిమా టీంకు థాంక్స్. మిగతా విషయాలన్నీ సినిమా ప్రీ-రిలీజ్  ఈవెంట్‌లో మాట్లాడతాను’ అని అన్నారు.

విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి ఈ సినిమాను తీసిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నా మీద ఇంత డబ్బులు పెట్టి సినిమా తీశారు. పరిశ్రమలో ఎంతో మంది నాకు సపోర్ట్‌గా నిలిచారు. కె.ఎస్.రామారావు గారు, కాట్రగడ్డ ప్రసాద్ గారు, సుమన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, డీఎస్ రావు గారు, శ్రీకాంత్ గారు, ఆలీ గారు, ప్రసన్న గారు, దాము గారు చాలా మంది అండగా నిలిచారు. మీడియా నాకు ఎప్పుడూ సపోర్ట్‌గానే నిలుస్తుంది. కొత్త వాళ్లకు ఎంకరేజ్‌మెంట్ ఇవ్వండి. అందరూ సపోర్ట్ చేస్తేనే యంగ్ స్టర్స్ ఇంకా వస్తుంటారు. కలియుగం పట్టణంలో సినిమా నాకు ప్రత్యేకం. మదర్ సెంటిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి చిత్రాన్ని తీశారు. చంద్ర ఓబుల్ రెడ్డి గారు మా అందరినీ చక్కగా చూసుకున్నారు. చరణ్ అన్న కెమెరా వర్క్ బాగుంది. అజయ్ సాంగ్స్, బీజీఎం బాగుంది. ఆయుషితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆమె ఎంతో సపోర్ట్ చేశారు. దేవీ ప్రసాద్, రూప లక్ష్మీ గార్లతో పని చేయడం సంతోషంగా ఉంది. చిత్రా శుక్లా గారు ఓ స్పెషల్ రోల్ చేశారు. మా చిత్రం మార్చి 22న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

 ఆయుషి పటేల్ మాట్లాడుతూ.. ‘నాకు చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. మూవీల్లోకి వస్తున్నానంటే చాలా మంది నిరుత్సాహపరిచారు. ఈ సినిమాకు పని చేసిన రోజుల్లో ఏ రోజు కూడా అన్ కంఫర్టబుల్ గా అనిపించలేదు. ప్రతీ చోటా మంచి చెడూ అనేది ఉంటుంది. పిల్లల ఇష్టాయిష్టాలను తెలుసుకుని తల్లిదండ్రులు ప్రోత్సహించండి. నా తండ్రి నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. అన్ని ఎమోషన్స్ ఉన్న ఓ థ్రిల్లర్ మూవీ కలియుగం పట్టణంలో. చాలా ట్విస్టులుంటాయి. ఇలాంటి ఆలోచన మా దర్శకుడికి ఎలా వచ్చిందని అనుకున్నాను. కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి పాత్ర లభించడం ఆనందంగా ఉంది. మా నిర్మాతలు నాని, మహేష్, రమేష్ గార్లకు థాంక్స్. విశ్వ కార్తికేయతో పని చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రం మార్చి 22న రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

 నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా నేను వచ్చాను. మళ్లీ ఇప్పుడు టీజర్ లాంచ్‌కు వచ్చాను. సినిమా చాలా బాగా తీశారు. రాజేంద్ర ప్రసాద్ గారు, దాము, నీలకంఠ గార్లను మళ్లీ ఇలా కలవడం ఆనందంగా ఉంది. రెండు సినిమాలు తీశాక.. ఇక సినిమాలు వద్దని అనుకున్న టైంలో రాజేంద్ర ప్రసాద్ గారితో తీయాలని అనుకున్నాం. అదే ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు. ఆ తరువాత ఇరవై చిత్రాలు చేశాను. దాము గారు నన్ను విలన్‌గా తెరకు పరిచయం చేశారు. నీలకంఠ గారితో ఒక సినిమా చేశాను. విశ్వ కార్తికేయ చైల్డ్ ఆర్టిస్ట్ అన్న సంగతి తెలిసిందే. అతని స్థాయికి సరిపడా సినిమా రాలేదు. ఈ చిత్రంతో విశ్వ కార్తికేయ విశ్వ రూపం చూస్తారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

 నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘కలియుగం పట్టణంలో సినిమా టీజర్ బాగుంది. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. విశ్వ కార్తికేయ, ఆయుషి జంట బాగుంది. వారికి ఆల్ ది బెస్ట్. ఒక సినిమా కోసం ఇండస్ట్రీలోకి రావొద్దు. కంటిన్యూగా సినిమాలు చేయాలి. కొత్తగా వచ్చే నిర్మాతలను కాపాడుకునే బాధ్యత దర్శకులదే ఉంటుంది. గత నాలుగేళ్లుగా చదువుకున్న వారు, వ్యాపారవేత్తలు చాలా మంది నిర్మాతలుగా వస్తున్నారు. యంగ్ నిర్మాతలు, కొత్తగా వచ్చే వారు కంటిన్యూగా సినిమాలు తీసేలా ప్లానింగ్ చేసుకోవాలి. మార్చి 22న ఈ చిత్రం రాబోతోంది. అందరూ ఆశీర్వదించండి’ అని అన్నారు.


More Press Releases