శిక్షణ కార్యక్రమంలో బ్రీత్ ఎనలైజర్లు మరియు సర్టిఫికెట్లను అందజేసిన అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్.

Related image

రోడ్డు ప్రమాదాలను అరికట్టే చర్యలలో భాగంగా రోడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రీత్ అనలైజర్ల ఒకరోజు శిక్షణ కార్యక్రమం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారంనాడు ముగిసింది. రైల్వేలు & రోడ్ సేఫ్టీ అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఆధునిక బ్రీత్ అనలైజర్ లను వినియోగించే విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల మరియు కమిషనరేట్ల సంబంధిత విభాగపు అధికారులు హాజరయ్యారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు అధికారులకు అడిషనల్ డీజీపీ సర్టిఫికెట్లను మరియు ఆధునిక బ్రీత్ అనలైజర్ లను అందజేశారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... బ్లూటూత్ కు అనుసంధానం చేస్తూ లెక్కించే విధానం ఈ ఆధునిక బ్రీత్ ఎనలైజర్ల పరికరాలలో ఉందన్నారు. వీటిని వినియోగించే విధానంపై శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యం కలిగిన సిబ్బందితో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఆధునిక పరికరాల సహాయంతో రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని అన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వారికి అవగాహన కల్పించడం మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఈ రకమైన ప్రమాదాలను నియంత్రించాలన్నారు. కేసులను నమోదు చేయడంతో పాటు సాధ్యమైన సందర్భాలలో వారికి ఈ రకమైన ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ, జరిగే నష్టాన్ని వారికి వివరించాల్సి ఉందన్నారు. ప్రమాదాల బారిన పడితే వారితోపాటు వారి కుటుంబ సభ్యుల దయనీయ స్థితిని వారికి వివరించాలన్నారు. ఈ పద్ధతుల ద్వారా ఈ రకమైన రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ సూచించారు. 


ఈ సందర్భంగా 50 బ్రీత్ అనలైజర్ లను అందజేసిన డయాజియో మరియు సిఎస్ఆర్ బాక్స్ స్వచ్ఛంద సంస్థ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. డీఎస్పీ వహీదుద్దీన్ , సిఎస్ఆర్ బాక్స్ నిర్వాహకులు రజత్ సరోహ లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

       

More Press Releases