మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు

Related image

హైదరాబాద్, ఫిబ్రవరి 17 : ఈనెల 21 వ తేదీ నుండి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో శనివారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని, జాతర ప్రారంభం కాగానే భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మేడారానికి వచ్చే ప్రతీ ఒక్కరు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా అమ్మవార్ల దర్శనం పూర్తి చేసుకొని సంతోషంతో తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

జాతరలో ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విస్తృత స్థాయిలో పోలీస్ బందోబస్తును, చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. జాతర లో దాదాపు 4800 సి.సి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి ఆరు వేల బస్సులను మేడారానికి నడుపుతున్నామని, మేడారం లో 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి 26 వ తేదీ వరకు బస్సులను నడుపుతున్నామని, ఇందుకు దాదాపు 9000 బస్ డ్రైవర్లను నియమించామని వివరించారు.

జాతరలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, ఇందుకు గాను ప్రత్యేకంగా 4000 పారిశుధ్య కార్మికులను నియమించామని సి.ఎస్ పేర్కొన్నారు. మేడారాన్ని మొత్తం 8 జోన్లుగా విభజించి పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. 5600 మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు వెయ్యి మందిని నియమించామని తెలిపారు. జాతర సందర్భంగా విద్యుత్ సరఫరాకు ఏవిధమైన అంతరాయం కలుగకుండా ప్రత్యేకంగా సబ్ స్టేషన్ ఏర్పాట్లు చేశామని చెప్పారు.

మేడారం గద్దెలను దర్శించుకునే వారికి క్యూ-లైన్ల ఏర్పాటు పూర్తయిందని, గద్దెల వద్ద నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జాతర వివరాలను అందించడానికి మేడారం లో ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు తో పాటు ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.

జాతరలో ఏవిధమైన ఆహార కల్తీ కాకుండా ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలను పరీక్షించడానికి ఫుడ్ చెకింగ్ ఇన్స్పెక్టర్లను నియమించామన్నారు. జాతర సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షించేందుకు గాను ప్రత్యేకంగా ఐదుగురు ఐఏఎస్ అధికారులను హైదరాబాద్ నుండి నియమిస్తున్నామని సి.ఎస్ శాంతి కుమారి వెల్లడించారు. జాతరకు హాజరయ్యే ప్రతీ ఒక్కరు ప్రభుత్వం సూచించే నియమ, నిబంధనలను పాటించి జాతర సజావుగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో డిజిపి రవిగుప్తా, ఎండోమెంట్స్, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ముఖ్య కార్యదర్శులు శ్రీనివాస రాజు, సందీప్ కుమార్ సుల్తానియా, రిజ్వీ, వాణీ ప్రసాద్, , డిజి ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, కార్యదర్శులు రాహుల్ బొజ్జా, క్రిస్టినా జెడ్ చోంగ్తు, శరత్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతరావు, TSRTC MD సజ్జనార్, పంచాయత్ రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, ఎక్సైజ్ కమీషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్లు భూపాలపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, జిల్లా ఎస్పీలు ములుగు, టూరిజం ఎండీ రమేష్ నాయుడు, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases