మానవ జీవితంలో విద్య చాలా ముఖ్యమైనది: మంత్రి కొప్పుల ఈశ్వర్

Related image

  • మహిళలు చదువుకుంటే కుటుంబంతో పాటు దేశం బాగుపడ్తుంది
  • షాధీ ముభారక్, కళ్యాణ లక్ష్మీ పథకాలతో అమ్మాయిలు చదువుకుంటున్నారు, బాల్య వివాహాలు తగ్గాయి
  • అందరికి ఉచిత విద్యనందించాలనే దృఢ సంకల్పంతోనే కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారు
  • పిల్లల మాస పత్రిక "తుంబి"ని ఆవిష్కరించిన మంత్రి
  • నార్సింగి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మొక్కల్ని నాటి, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి
హైదరాబాద్: మానవ జీవితంలో విద్యను మించినది మరొకటి లేదని, దీంతోనే వికాసం ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ముఖ్యంగా మహిళలు చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం తద్వారా దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నగర శివార్లలోని నార్సింగి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఆయన "తుంబి"అనే పిల్లల మాస పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని వివరించారు.

అదేవిధంగా షాధీ ముభారక్, కళ్యాణ లక్ష్మీ పథకాలను కూడా ప్రవేశపెట్టడంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయని, అమ్మాయిలు చక్కగా చదువుకుంటున్నారని పేర్కొన్నారు. గురుకులాలలో చదువుతున్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలబాలికలు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతుండడం, అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుండడం సంతోషం కలిగిస్తుందన్నారు.మహనీయుల జీవిత చరిత్రలు, విజయగాథలు, నీతి కథలు, పెయింటింగ్స్,కార్టూన్స్ తో కూడిన ఈ "తుంబి"మాస పత్రిక వంటి మ్యాగజైన్ ను మన గురుకుల విద్యార్థులు కూడా తీసుకు వస్తే బాగుంటుందన్నారు.

మనిషి ప్రకృతితో కలిసి ముందుకు సాగాలని, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యతను ఈ "తుంబి"గుర్తు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ, ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న వాళ్లు దేశవిదేశాలలో గొప్పగా స్థిరపడుతున్నారని, నిన్ననే నలుగురు అమ్మాయిలు ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్లారని తెలిపారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, "తుంబి" పత్రిక పుస్తక పఠనాన్ని,భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు దోహద పడుతుందన్నారు.

బాలబాలికలలో నిగూఢమై ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు గాను తమిళనాడుకు చెందిన శివరాజు (శివన్న )20ఏండ్లుగా "తుంబి"( తూనీగ)మాస పత్రికను తీసుకు వస్తుండడాన్ని మంత్రి కొప్పుల, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, డైరెక్టర్ హరికృష్ణలతో పాటు ఉపాధ్యాయులు కొనియాడారు, విద్యార్థులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి తమ హర్షామోదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు,భోజనం చేశారు. వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తరగతి గదులను పరిశీలించారు, శుభ్రత, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ గురించి పలు సూచనలు చేశారు. సలహాలిచ్చారు. కార్యక్రమానికి ముందు బాలికలు ప్రదర్శించిన "రేలా రేలా ఇది తెలంగాణ నేల"అనే నృత్య రూపకం అందరిని అలరించింది. 

More Press Releases