ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం 309 దేవాలయాలకు కోటి 3 లక్షల రూపాయల విలువైన బోనాల చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని గుడి మల్కాపూర్ లో గల జాంసింగ్ బాలాజీ దేవాలయంలో కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని 119 దేవాలయాలకు 47 లక్షలు, నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని 50 దేవాలయాలకు 18 లక్షల రూపాయల విలువైన చెక్కులను హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ చీఫ్ విప్ MS ప్రభాకర్ రావు లతో కలిసి ఆయా ఆలయాల కమిటీ సభ్యులకు అందజేశారు. 

అనంతరం బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని 72 దేవాలయాలకు 22 లక్షలు, మలక్ పేట డివిజన్ లోని 68 దేవాలయాలకు 16 లక్షల రూపాయల విలువైన చెక్కులను MLA రాజాసింగ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల రూపాయలు విడుదల చేయగా, 3500 కు పైగా దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో బోనాల తర్వాత ఆర్ధిక సహాయం చెక్కులను అందించడం జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం ఈ నెల 24 వ తేదీన బోనాల ఉత్సవాలు నిర్వహించే దేవాలయాలకు ముందే చెక్కులను అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, పలువురు కార్పొరేటర్ లు పాల్గొన్నారు.

More Press Releases