అందరికి ఆరోగ్యమే తెలంగాణ ప్రభుత్వ సంకల్పం - సీఎం కేసీఆర్‌ ద్యేయం

Related image

  • జాతీయ ఆరోగ్య సూచికల్లో గణనీయ ప్రగతి సాధించిన తెలంగాణ
  • 3 అంచెల వైద్యాన్ని 5 అంచల వ్యవస్థగా విస్తరణ
  • ప్రజల ముంగిటకే ప్రాథమిక వైద్యం
  • పేదలకు చేరువగా అత్యాధునిక సూపర్‌ స్పెషలిటీ వైద్యం
  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవలను రోజుకి 25 వేల నుంచి 30 వేల మంది పొందుతున్నారు
హైదరాబాద్‌, జూన్‌ 14: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆధ్వర్యంలో అందరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ పయనిస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికలలో తెలంగాణ రాష్ట్రం గణనీయ ప్రగతి సాధించింది. ఈ తేడా 2014తో పోల్చితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక లక్ష ప్రసవాలకు 2014 లో 92 ఉన్న మాతృమరణాలు, 2022 నాటికి 56 కు తగ్గాయి. 2014 లో 39 ఉన్న శిశుమరణాలు, 2022 నాటికి 23 కి తగ్గాయి. 2014 లో 5 సంవత్సరాలలోపున్న పిల్లల మరణాలు 41 ఉంటే, 2022 నాటికి ఆ సంఖ్య 30 కి పడిపోయింది. అదే పీరియడ్లో 25 ఉన్న బాలింత మరణాలు 16 కు తగ్గాయి. ఇమ్మ్యూనైజీషన్‌ వాక్సిన్‌ విషయానికి వస్తే 2014 లో 68% ఉంటే, 2022 నాటికి 100%కు చేరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 2014 లో 30% ఉంటే, 2022 నాటికి 56% పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్య 98% కు పెరిగింది.

అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉంది. కేంద్ర ప్రభుత్వమునకు చెందిన ‘‘నీతి ఆయోగ్‌ ‘‘ విడుదల చేసిన 4 వ ఆరోగ్య సూచిల్లో తెలంగాణ రాష్ట్రం కేరళ, తమిళనాడు తర్వాత 3 వ స్థానానికి చేరింది.తలసరి ప్రభుత్వం చేస్తున్న వైద్యఖర్చుల్లో రూ.1,698 లతో హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ తర్వాత తెలంగాణ రాష్ట్రం నిలిచింది. 2022-23 బడ్జెట్లో దానిని రూ.3,091 లకు పెంచారు. అలాగే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన హెల్త్‌ ఫిట్నేషన్‌ కాంపెయిన్‌ లో 3 కేటగిరిల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణ రాష్ట్రం 3 అవార్డులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు అమలులో మొదటి స్థానంలోనూ, నాన్‌ కమ్మునికబుల్‌ వ్యాధుల స్క్రీనింగ్‌ లో 2 వ స్థానంలో నిలిచింది. కరోనా నియంత్రణతోపాటు కోవిడ్‌ వాక్సినేషన్‌ ఇవ్వడంలో తెలంగాణ ముందు నిలిచింది. ఇదంతా వట్టిగనే సాధ్యం కాలేదు వైద్య సదుపాయల విస్తరణ, నిరంతర మానిటరింగ్‌ తో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ పధకాలు - కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కె సి ఆర్‌ కిట్‌, ఆరోగ్య లక్ష్మి, అమ్మవడి పధకాల సమ్మిళిత ఫలితాలే జాతీయ స్థాయిలో తెలంగాణ సాధించిన ఆరోగ్య సూచికలుగా పేర్కొనవచ్చు.

అయితే వైద్యసేవలు గురించి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విస్తరించిన సదుపాయాలు, ప్రజలందరికి అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యసేవలు అని స్పష్టంగా పేర్కొనవచ్చు.

హెల్త్‌ హబ్‌ గా హైదరాబాద్‌ నగరమునకు అంతర్జాతీయ గుర్తింపు కలిగివున్నది. దేశ విధేశి ప్రజలు వైద్యసేవలకై హైదరాబాద్‌ కు వస్తుండటం వలన హెల్త్‌ టూరిజం భాగా విస్తరించింది.

తెలంగాణ ప్రజలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షకు అనుగుణంగా నిరుపేదలకు కూడా కార్పొరేట్‌ స్థాయి అత్యాధునిక  వైద్యం అందుబాటులోకి తెచ్చుటకు ప్రాధమిక స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక వసతులు కల్పించడం జరిగింది.

గతంలో మూడు అంచెలు- ప్రాధమిక సేవలకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ద్వితీయ స్థాయి సేవలకు జిల్లా ఆసుపత్రులు, స్పెషలిటీ సేవలకు మెడికల్‌ కాలేజీలుగా ఉన్న వైద్య సేవలు వ్యవస్థకు అదనంగా ప్రివేంటివ్‌ సేవలకు బస్తీ /పల్లె దావఖానలు, సూపర్‌ స్పెషలిటీ వైద్య సేవలకు టిమ్స్‌ లతో 5 అంచెలు వ్యవస్థగా మార్చి ప్రజల ముంగిటకే ప్రాధమిక వైద్యాన్ని, పేదలకు అందుబాటులోకి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది.

గతంలో క్షేత్ర స్థాయిలో వ్యాధులను గుర్తించే ప్రివేంటివ్‌ సేవలు అందించే వ్యవస్థ లేదు. అలాగే అత్యాధునిక సూపర్‌ స్పెషలిటీ వైద్య సేవలు అందించే టిమ్స్‌ లాంటి ప్రత్యేక వ్యవస్థ లేదు. 5 అంచెల వ్యవస్థతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక వైద్య సేవలు, రోగ నిర్దారణ పరికరాలతోపాటు ఐసియు బెడ్స్‌ ను అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే వైద్య భోదన కళాశాలల్లో ఐసియు బెడ్స్‌ ను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటిసారి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రోగనిర్దారణ పరీక్షా కేంద్రాలను నెలకొల్పిన ప్రభుత్వం, వాటి నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నది.

గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక సెంట్రల్‌ డయాగ్నస్టిక్‌ లేబరేటరీని ఏర్పాటు చేశారు.మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన ప్రభుత్వ డయాగ్నస్టిక్‌ కేంద్రాలలో జరుగుతున్న రోగ నిర్దారణ పరీక్షలను మానిటరింగ్‌ చేస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సౌలభ్యం కొరకు 42 డయాలసిస్‌ కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది. ఈ కేంద్రాల సంఖ్యను 102 కు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. డయాలసిస్‌ కేంద్రాలకు రోగులు వచ్చేపోయేందుకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 ఆసుపత్రుల్లో సి.టి. స్కాన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె సంబందిత శస్త్ర చికిత్సలు నిర్వహించుటకు హైదరాబాద్‌ తో పాటు ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌ లలో క్యాథ్‌ ల్యాబ్‌ లను ప్రభుత్వం నెలకొల్పింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రతి బెడ్‌ కు చేస్తున్న ఖర్చును రూ 5,000 నుంచి రూ 7,500 లకు పెంచడం జరిగింది. సాధారణ రోగులకు ఇచ్చే డైట్‌ ఛార్జిలను రోజుకు రూ.40 నుంచి రూ.80 లకు పెంచడం జరిగింది. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల నమ్మకం, విశ్వాసం నానాటికి పెరుగుతున్నది. ప్రభుత్వ వైద్యసేవలను పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా రోజుకు 25,000-30,000 కు పెరిగింది. అందత్వరహిత తెలంగాణ లక్ష్యంగా నిర్వహించిన ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమం కింద 1 కోటి 52 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి దృష్టి లోపం ఉన్న 41 లక్షల వమందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్‌ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వైద్యంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయి.

రాష్ట్ర ప్రజలు వైద్య అవసరాలను నెరవేర్చే సంకల్పంతో వైద్య విద్య విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. అందులో భాగంగా వరంగల్‌ లో కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం నెలకొల్పింది. తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి తెలంగాణలో ప్రభుత్వపరంగా 5 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. మొదటి దశలో ఒక్కొక్కటి రూ.450 కోట్ల వ్యయంతో కొత్తగా మహబూబ్నగర్‌, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేట లలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు నడుస్తున్నాయి.

ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.2021 లో 8 కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో దానికి రూ.510 కోట్ల వ్యయంతో సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, జగిత్యాల, మహబూబాబాద్‌, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం లలో మెడికల్‌ కాలేజిల ఏర్పాటు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 2022-23 నుంచే ఈ 8 మెడికల్‌ కాలేజీలలో తరగతులు ప్రారంభంకానున్నాయి.

2023-24 లో మరో 8 మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. రాష్ట్రంలో 2014 లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న 700  యం. బి. బి ఎస్‌. సీట్లు 2021 నాటికి 1,649 సీట్లకు పెరిగాయి. 2014 లో 531 ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సీట్లు 2021 నాటికి 967 కు పెరిగాయి. 2014 లో 82 ఉన్న సూపర్‌ స్పెషలిటీ సీట్లు 2021 నాటికి 153 కు పెరిగాయి. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు అయిన తర్వాత యం.బి. బి ఎస్‌. సీట్లు 5,240 కు, పీజీ మెడికల్‌ సీట్లు 2,500 లకు, సూపర్‌ స్పెషలిటీ సీట్లు 1,000 కు చేరుతాయి.

ఉత్తర తెలంగాణ జిల్లాలకు తలమానికంగా ఉన్న వరంగల్‌ ను హెల్త్‌ సిటీ గా అభివృద్ధి చేయుటకు 2,000 పడకల సామర్ధ్యంతో రూ.1,100 కోట్లతో జనరల్‌ మెడిసిన్‌,జనరల్‌ సర్జరీ, ఈ. ఎన్‌ టి. డెర్మటాలాజీ, ఆర్దోపిడిక్స్‌, ఆంకాలజీ, న్యూరాలాజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ, గ్యాస్త్రో ఎంటరాలాజీ, కార్డియాలజీ, యురాలాజీ, నెఫ్రాలజీ వంటి 35 రకాలు సూపర్‌ స్పెషలిటీ విభాగాలతో మల్టీ సూపర్‌ స్పెషలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ ఆసుపత్రిలో అత్యాధునిక క్యాన్సర్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్‌ నగరవాసులతో పాటు ఆధునిక వైద్య సేవలకొరకు చుట్టు పక్కల జిల్లాల నుంచి వచ్చే వారికి అందుబాటులో వుండే విధంగా ఎయిమ్స్‌ తరహాలో నగరానికి నాలుగు వైపులా తెలంగాణ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సస్‌ (టిమ్స్‌ ) పేరున సూపర్‌ స్పెషలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా 1,500 పడకలతో గచ్చిబౌలి లో టిమ్స్‌ ఆసుపత్రిని ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. మొత్తం రూ.2,679 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటి 1,000 ఆక్సీజన్‌ పడకల  సామర్థ్యంతో ఆల్వాల్‌, గడ్డి అన్నారం, ఎర్రగడ్డలలో సూపర్‌ స్పెషలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు ఇటీవలనే శంకుస్థాపన చేశారు. వీటిలో 300 ఐసీయు పడకలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి టిమ్స్‌ ఆసుపత్రిల్లో 26 రకాల ఆపరేషన్‌ ధియేటర్లు, 30 రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవల విభాగాలు, 16 స్పెషాలిటీ,15 సూపర్‌ స్పెషాలిటీ పీజీ మెడికల్‌ కోర్సులు, నర్సింగ్‌, పారా మెడికల్‌ కోర్సులు ఏర్పాటు కానున్నాయి. నిమ్స్‌ ను విస్తరించుటకు, ఇతర టీచింగ్‌ హాస్పిటల్స్‌ లో సీట్లు పెంపుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.

పట్టణ పేదలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ లో 256 బస్తీ దవాఖానలను ప్రభుత్వం నెలకొల్పింది. వీటి స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 141 మున్సిపాలిటీలలో కొత్తగా 288 బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టుటకు 57 రకాల రోగానిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయుటకు తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ ల్యాబ్‌ ను ప్రభుత్వం నెలకొల్పి, ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేసింది. ప్రాధమిక స్థాయిలో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,745 సబ్‌ సెంటర్లను ‘‘పల్లె దవాఖాన’’లుగా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారిలో అత్యధికులు పేదలే. చికిత్సకొరకు వచ్చిన పేద రోగులు దురదృష్టవశాత్తు చనిపోతే ఆ పార్దివదేహాన్ని సొంతురుకి తీసుకువెళ్ళుటకు పడే కష్టాలు గురించి వినాలంటేనే భాద కలుగుతుంది. చనిపోయిన వ్యక్తి భౌతికకాయాన్ని గౌరవప్రదంగా ఇంటికి చేర్చాలనే ఉద్దేశ్యంతో పార్ధివ వాహన సేవలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నది. దేశంలో మొదటిసారి ఇటువంటి సేవలను ప్రవేశపెట్టి,రాష్ట్రవ్యాప్తంగా 50 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌ లోని 18 ప్రధాన ఆసుపత్రులకు వైద్య సేవలు పొందుతున్న రోగులతో పాటు వచ్చే సహాయకులకు రూ.5/- లకే మూడు పూటలా భోజన సదుపాయం కల్పించబడిరది. ఈ పథకం కింద ప్రతి రోజు సుమారు 18,600 మంది రోగి సహాయకులు లబ్ధిపొందుతున్నారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆధ్వర్యంలో ముందుచూపుతో అందరికి అభివృద్ధి, సంక్షేమఫలాలు అందించుటకు ప్రభుత్వం చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తున్నది. అదే స్ఫూర్తితో ఆరోగ్య కుటుంబ సంక్షేమ పధకాలు అమలులో ముందున్న రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నది.

More Press Releases