Buma Akhila Priya: మాజీమంత్రి అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌పై హత్యాయత్నం.. కారుతో ఢీకొట్టి మారణాయుధాలతో దాడి

  • అఖిలప్రియ ఇంటి బయట పహారా కాస్తుండగా ఘటన
  • కారులో వచ్చి ఢీకొట్టిన దుండగులు
  • ఆపై మారణాయుధాలతో దాడి
  • నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్
  • ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల పనేనని అనుమానం
Bhuma Akhila Priya bodygaurd was attacked

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హత్యాయత్నం జరిగింది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత అఖిలప్రియ ఇంటిముందు నిఖిల్‌ పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత కారులోంచి మారణాయుధాలతో దిగిన ముగ్గురు వ్యక్తులు ఆయనపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు.  తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను వెంటనే నంద్యాల ఆసుపత్రికి తరలించారు. 

ఇది ప్రతీకార దాడి అని భావిస్తున్నారు. టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాలలో కొనసాగుతున్న సమయంలో తమ ప్రత్యర్థి అయిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడిచేశారు. నిఖిల్ కూడా సుబ్బారెడ్డిపై చేయిచేసుకున్నట్టు వార్తలొచ్చాయి. తాజా దాడికి అదే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు నాయకుల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు. ఏవీ సుబ్బారెడ్డి, చంద్రతోపాటు మరో నలుగురిపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News