zolgensma injection: పసిప్రాణం కోసం ఒక్కటైన సమాజం.. రూ. 17.5 కోట్ల ఇంజెక్షన్ కోసం 2 నెలల్లో రూ. 9 కోట్లు సేకరణ!

Crowdfunding Helps Toddler Get 17 Crore Jab
  • క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమకూరిన డబ్బుతో 22 నెలల బాలుడికి ప్రాణాధార ఇంజెక్షన్ అందించిన వైద్యులు
  • ఇంజెక్షన్ దిగుమతిపై రూ. 3 కోట్ల కస్టమ్స్ డ్యూటీని మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం
  • మిగతా సొమ్మును ఏడాదిలోగా మూడు వాయిదాల్లో కడతామన్న తల్లిదండ్రులు.. ఒప్పుకున్న ఇంజెక్షన్ తయారీ కంపెనీ

రాజస్తాన్ లో ప్రాణాపాయం అంచున కొట్టుమిట్టాడుతున్న ఓ 22 నెలల బాలుడిని కాపాడేందుకు సామాన్యులంతా చేయిచేయి కలిపారు. తోపుడు బండ్ల చిరు వ్యాపారులు మొదలు పోలీసుల దాకా అందరూ మానవత్వాన్ని చాటారు. ఆ చిన్నారిని బతికించేందుకు అవసరమైన జోల్ జెన్స్ మా అనే రూ. 17.5 కోట్ల ఖరీదైన విదేశీ ఇంజెక్షన్ ను తెప్పించేందుకు తమ వంతు సాయం చేశారు. కేవలం 2 నెలల వ్యవధిలో ఏకంగా రూ. 9 కోట్లను విరాళంగా అందించారు. మానవ సంబంధాలు ఎంత గొప్పవో ఈ సంఘటన తెలియజేసింది.

రాజస్తాన్ పోలీసు శాఖలో ఎస్సైగా పనిచేస్తున్న నరేశ్ శర్మకు హృదయాంశ్ శర్మ అనే 22 నెలల బాలుడు ఉన్నాడు. అయితే ఆ బాలుడికి అత్యంత అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే నరాల వ్యాధి రావడంతో కాళ్లు, చేతులు కదపలేకపోతున్నాడు. దీంతో రెండు నెలల కిందట నరేశ్ శర్మ దంపతులు తమ కుమారుడిని జైపూర్ లోని జేకే లోన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అతను జన్యు లోపంతో బాధపడుతున్నట్లు తేల్చారు. జన్యు లోపాన్ని సరిచేసే ఇంజెక్షన్ ను పుట్టిన రెండేళ్లలోగా ఇస్తే బాలుడు బతుకుతాడని లేకపోతే ప్రాణాపాయం తప్పదని పిడుగులాంటి వార్త చెప్పారు. 

దీంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు తమ చిన్నారిని రక్షించుకొనేందుకు బంధువుల సూచనతో క్రౌడ్ ఫండింగ్ బాట పట్టారు. తమ బ్యాంకు ఖాతా వివరాలతో ఆన్ లైన్ ద్వారా విరాళాల సేకరణ ప్రారంభించారు. తోచినంత సాయం చేయాలని రాజస్తాన్ సీఎం సహా రాజకీయ నాయకులు, పోలీసులు, సెలబ్రిటీలను అర్థించారు. దీనిపై స్పందించిన రాజస్తాన్ పోలీసు శాఖ మొత్తం డిపార్ట్ మెంట్ లోని ఉద్యోగుల ఒక రోజు వేతనమైన రూ. 5 కోట్లను విరాళంగా అందించింది. అలాగే ప్రముఖ నటుడు సోనూ సూద్, క్రికెటర్ దీపక్ చాహర్ వంటి సెలబ్రిటీలతోపాటు ఎందరో సామాన్యులు తమకు తోచిన మొత్తాన్ని అందించారు. దీంతో రెండు నెలల వ్యవధిలో రూ. 9 కోట్లు సమకూరాయి.

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అత్యంత ఖరీదైన విదేశీ ఇంజెక్షన్లలో ఒకటైన జోల్ జెన్స్ మా దిగుమతిపై విధిస్తున్న రూ. 3 కోట్ల కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మాఫీ చేసింది. దీంతో ఇంజెక్షన్ ధర రూ. 14.5 కోట్లకు తగ్గింది. కానీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ. 9 కోట్లే సమకూరడం, అప్పటికే బాలుడికి 22 నెలలు రావడంతో సమయం మించిపోతోందని గ్రహించిన బాలుడి కుటుంబం ఇదే విషయాన్ని ఇంజెక్షన్ తయారీ కంపెనీకి తెలియజేసింది. మిగతా సొమ్మును మూడు వాయిదాల్లో కడతామని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆ సంస్థ రూ. 9 కోట్లు తీసుకొని ఇంజెక్షన్ పంపింది. దీంతో వైద్యులు వెంటనే బాలుడికి ఆ ఇంజెక్షన్ అందించారు. రాజస్తాన్ లో ఈ స్థాయిలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు లభించడం ఇదే తొలిసారి. విరాళాల సేకరణలో రాజస్తాన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (రానా) కూడా కీలకపాత్ర పోషించింది.

  • Loading...

More Telugu News