Canada Gold Cash Heist: కెనడాలో 6,600 బంగారం బిస్కెట్ల చోరీ.. మరో భారత సంతతి నిందితుడి అరెస్టు!

  • గతేడాది టొరొంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో భారీ చోరీ
  • ఎయిర్ కెనడా విమానంలో వచ్చిన 6,600 ప్యూర్ బంగారం బిస్కెట్లు, విదేశీ కరెన్సీని దొంగిలించిన వైనం 
  • చోరీలో ఎయిర్ కెనడా సంస్థ మాజీ ఉద్యోగుల పాత్ర
  • గత నెలలో మరో ఇద్దరు భారత సంతతి నిందితుల అరెస్టు, తాజాగా పోలీసుల అదుపులో మరో వ్యక్తి
Another Indian Origin Man Arrested In Canadas Biggest Gold Cash Heist

కెనడా చరిత్రలోనే భారీ స్థాయిలో జరిగిన 400 కిలోల బంగారం బిస్కెట్ల చోరీ కేసులో తాజాగా మరో భారత సంతతి నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. భారత్‌ నుంచి ఇటీవల టొరొంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. అంతకుమునుపే అతడిపై అరెస్టు వారెంట్ జారీ అయినట్టు పేర్కొన్నారు. 

గతేడాది ఏప్రిల్ 17న ఈ చోరీ జరిగింది. ఎయిర్ కెనడా సంస్థ విమానం కార్గోలో వచ్చిన 22 మిలియన్ కెనేడియన్ డాలర్ల విలువైన 400 కేజీల బంగారు బిస్కెట్లు, విదేశీ కరెన్సీ చోరీకి గురయ్యాయి. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) నుంచి విమానంలో టొరొంటోలోని పియర్సన్ విమానాశ్రయానికి బంగారం బిస్కెట్లు, నగదు వచ్చాయి. బంగారం ఉన్న కంటెయినర్‌ను తొలుత ఎయిర్‌పోర్టులోని ఓ ప్రత్యేక స్థలానికి తరలించారు. ఆ మరుసటి రోజే చోరీ జరిగిన విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. 

ఈ కేసుకు సంబంధించి గత నెలలో భారత సంతతికి చెందిన పరమ్‌పాల్ సిధూ (54), అమిత్ జలోతా (40), అమ్మద్ చౌదరి (43), అలీ రజా (37), ప్రసత్ పరమలింగం (35)ను పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ కెనడా సంస్థలో పనిచేసిన మరో భారత సంతతి వ్యక్తి సిమ్రన్ ప్రీత్ పనేసర్ (31), మిసిసాగా ప్రాంతానికి చెందిన అర్సలాన్ చౌదరి (42)లపై అరెస్టు వారెంట్ లు కూడా జారీ అయ్యాయి. ఈ చోరీలో ఎయిర్ కెనడాకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న సిధూ, పనేసర్లు తమ వద్ద పనిచేశారని ఎయిర్ కెనడా సంస్థ ప్రతినిధి మీడియాకు తెలిపారు.  వీరిలో ఒకరు అరెస్టు వారెంటు జారీకి మునుపే సంస్థను వీడారని, మరో వ్యక్తిని సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఈ చోరీలో 400 కిలోల బరువున్న 6,600 గోల్డ్ బార్స్ (.9999 ప్యూర్ బంగారం), 2.5 మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీని నిందితులు ఎత్తుకెళ్లారు.

  • Loading...

More Telugu News