G. Kishan Reddy: అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు... కేసీఆర్ మాదిరి రేవంత్ రెడ్డి ప్రమాదకారి: కిషన్ రెడ్డి

  • అబద్ధాలు ఆడటంలో ఇద్దరూ ఆరితేరారని విమర్శ
  • కాంగ్రెస్ అబద్ధాలను ఇంటిపేరుగా మార్చుకుందని వ్యాఖ్య
  • ఉచిత బస్సు ప్రయాణం తప్ప కాంగ్రెస్ ఏ హామీని నెరవేర్చలేదన్న కిషన్ రెడ్డి
Kishan Reddy press meet in Hyderabad

అధికారం కోసం సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రమాదకారి అని హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అబద్ధాలు ఆడటంలో వీరిద్దరూ ఆరితేరారన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఇంటిపేరుగా మార్చుకుందని విమర్శించారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదన్నారు. తన 100 రోజుల పాలన రెఫరెండమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని... కానీ దేనిపైనో చెప్పాలన్నారు. కాంగ్రెస్ అవినీతి పైనా? ఆర్ ఆర్ ట్యాక్స్ పైనా? లేక ఆరు గ్యారెంటీల అమలుపై రెఫరెండమా? చెప్పాలని నిలదీశారు. దేశభక్తి, ధర్మబద్ధ పాలనకు ప్రజలు అండగా ఉండాలని ఆయన కోరారు.

అబద్ధాలతో కాంగ్రెస్ ఏడు దశాబ్దాలుగా రాజకీయం చేస్తోందని విమర్శించారు. భద్రతా బలగాలపై కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ నమ్మకం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ చేతకానితనం, అసమర్థత కారణంగా పాకిస్థాన్ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయలేకపోయామన్నారు. కానీ మోదీ హయాంలో భారత్ బలపడిందన్నారు.

  • Loading...

More Telugu News