Harish Rao: అందుకే కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లవలసి వచ్చింది: హరీశ్ రావు

  • బీజేపీతో తాము కలిసి ఉంటే కవిత అరెస్ట్ అయ్యేవారా? అని ప్రశ్న
  • రేవంత్ రెడ్డి బీజేపీతో మిలాఖత్ అయి బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపణ
  • ఎన్నికలు అవగానే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కనిపించరన్న హరీశ్ రావు
Harish Rao reveals why Kavitha jailed

బీజేపీతో పోరాటం ఫలితంగానే కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లవలసి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీజేపీతో పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే బీజేపీకే లాభం చేకూరుతుందని హెచ్చరించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ కృషి చేసిందని... ఇకముందూ చేస్తుందన్నారు. మైనార్టీల పిల్లల చదువుల కోసం రెసిడెన్షియల్ సూళ్లను 204కు పెంచిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

బీజేపీతో తాము కలిసి ఉంటే కవిత అరెస్ట్ అయ్యేవారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీతో మిలాఖత్‌ అయి బీఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిగానే బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఎవరూ మీకు అందుబాటులో ఉండరన్నారు. మళ్లీ ప్రజలకు అందుబాటులో ఉండేది బీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైనా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ కిట్టు పోయిందని, షాదీ ముబారక్ బంద్ అయ్యిందని, తులం బంగారం జాడ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా రివర్స్ గేర్‌లో నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు మాటలు చెప్పడం తప్ప, మైనార్టీలకు రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News