Chandrababu: ఈ స్థానం మాకు కావాలని పవన్ కల్యాణ్ అడిగితే కాదనలేకపోయాను: చంద్రబాబు

  • తిరుపతిలో కూటమి రోడ్ షో
  • హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • అలిపిరి బ్లాస్ట్ నుంచి తిరుమల వెంకన్న దయతో బయటపడ్డానన్న చంద్రబాబు
  • తిరుపతిలో తనకు ప్రతి గల్లీ తెలుసని వెల్లడి
  • కూటమి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టీకరణ
Chandrababu speech in Tirupati

టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పవన్ కల్యాణ్ కు నెల్లూరు ఎలా పరిచితమో, నాకు తిరుపతి అలాంటిదే అని చెప్పారు. తిరుపతిలో ప్రతి గల్లీ తనకు తెలుసని అన్నారు. 

"నాది పునర్జన్మ... 23 క్లేమోర్ మైన్లు నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి నాకు పునర్జన్మ ప్రసాదించాడు... దాన్ని సార్థకం చేసుకుంటాను. తిరుపతికి ఓ ప్రత్యేకత ఉంది... ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు పోటీ చేసిన నియోజకవర్గం. 

ఒక విధంగా తిరుపతి నా సొంత నియోజకవర్గం లాంటిది... ఎందుకంటే నేను ఇక్కడే పెరిగాను. తిరుపతి స్థానం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడిగితే కాదనలేకపోయాను. ఇక్కడ్నించి ఆరణి శ్రీనివాసులు జనసేన గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నారు... ఆయను గెలిపించేందుకు అందరూ సిద్ధమా? ఇక్కడ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు... కమలం పువ్వు గుర్తుపై ఆయనకు ఓటేసి గెలిపించాలి. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. 

తిరుపతి ప్రజలను అడుగుతున్నా... ఇక్కడ కనిపిస్తున్న అభివృద్ధి ఎవరు చేశారు? గరుడ ఫ్లై ఓవర్ ఎవరు ప్రారంభించారు? చంద్రగిరి బైపాస్ ఎవరు నిర్మించారు? చెరువుకు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? ఐఐటీ వచ్చింది ఎవరి వల్ల? 

తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా చేయాలని దేశంలోని అన్ని విద్యాసంస్థలను తీసుకువచ్చాం. తిరుపతిని హార్డ్ వేర్ హబ్ గా మార్చాం. టీసీఎల్, హీరో మోటార్స్, జోహో, కార్బన్, డిక్సన్, సెల్కాన్ కంపెనీలను తీసుకువచ్చి ఒక ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేశాం. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు చేశాం. కానీ ఈ దుర్మార్గుడు వచ్చి అమరరాజా బ్యాటరీస్ ను తరిమేశాడు. 

వైసీపీ వల్ల ఉద్యోగాలు వచ్చాయా? డీఎస్సీ పెట్టాడా? ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాడా? కూటమి అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతాం. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలతో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. కేంద్రంలో మోదీ గ్యారెంటీ ఉంది. రాష్ట్రంలో ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఉంది, సూపర్ సిక్స్ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఇవన్నీ అమలు చేస్తాం. 

తిరుపతి ఒక పవిత్ర క్షేత్రం... దీన్ని మనం కాపాడుకోవాలి. తిరుపతి పవిత్రతను దెబ్బతీసే వ్యక్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. వైసీపీ పాలనలో 160కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయి, అర్చకులపై దాడులు జరిగాయి, దేవాలయ ఆస్తులను కబ్జాలు చేశారు, భూములు కొట్టేశారు. దేవాలయ పవిత్రతను మంటగలిపి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. 

కూటమి అధికారంలోకి వస్తూనే దేవాలయాలు కూల్చివేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. కూటమి అధికారంలోకి వస్తే... వార్షికాదాయం రూ.50 వేలకు పైన ఉండే ఆలయాల్లో అర్చకులకు రూ.15 వేల వేతనం ఇస్తాం. రూ.50 వేలకు తక్కువ ఆదాయం ఉండే ఆలయాల్లో అర్చకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్యన వేతనం ఇస్తాం. ఇది కాకుండా కులవృత్తిగా గుర్తించి పురోహితులను, వంట బ్రాహ్మణులను ఆదుకుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకుని అన్ని దేవస్థానాల్లో బ్రాహ్మణులను ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమిస్తాం. 

ఇక్కడ బీసీలు కూడా ఉన్నారు. వైసీపీ పాలనలో మీకేమైనా న్యాయం జరిగిందా? ఇప్పుడు హామీ ఇస్తున్నాం... 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తాం. రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుపెడతాం. వెనుకబడిన వర్గాలను ఆదుకుంటాం. ఇది కాకుండా పేదలందరికీ నెలకు రూ.4వేలు పెన్షన్ ఇస్తాం... పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తాం... ప్రతి నెల మొదటి తారీఖునే ఇంటివద్దనే ఇస్తాం. 

మన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతోంది... జగన్ మేనిఫెస్టో వెలవెలబోతోంది. ఇవాళ ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. బాబాయ్ ని గొడ్డలితో లేపేసిన పార్టీ మనకు కావాలా? కోడికత్తి డ్రామా మనకు కావాలా? గులకరాయి డ్రామా మనకు కావాలా? 

ఏంటీ అరాచకాలు? రాష్ట్రం అభివృద్ధి అంతా పడకేసింది, ఆదాయం పడిపోయింది. ఎక్కడ చూసినా గంజాయి! తిరుపతిలోనూ గంజాయి ఉంది... ఇందులో వైసీపీ వాళ్లకు వాటాలు ఉన్నాయి! మళ్లీ వైసీపీకి పొరబాటున ఓటేస్తే మీ ఆస్తులు మీవి కావు. ఇవాళ కొత్త చట్టాన్ని తీసుకువచ్చాడు... మీ ఆస్తులపై కన్నేశాడు. 

ఈ తిరుపతి నేను పుట్టిన స్థానం, పవన్ కల్యాణ్ కు సెంటిమెంట్ ప్లేస్... నరేంద్ర మోదీ తిరుపతిని ఎప్పుడూ పవిత్రంగా భావిస్తారు. మేం ముగ్గురం కూడా ఒకటే హామీ ఇస్తున్నాం... తిరుపతిని ఒక పవిత్ర ప్రదేశంగా నిలుపుతాం. ఇక్కడ ప్రజాభిమానం చూస్తుంటే కూటమి గెలుపును ఎవరూ అడ్డుకోలేరు" అంటూ చంద్రబాబు ప్రసంగించారు. 

  • Loading...

More Telugu News