Harish Rao: రాష్ట్రం దివాళా తీసిందని సీఎం చెప్పవచ్చా? ఆయన మాటలతో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది: హరీశ్ రావు

  • నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాదిమంది రోడ్డున పడ్డారని ఆవేదన
  • బీజేపీ, కాంగ్రెస్ చెరో ఎనిమిది సీట్లలో గెలిచేలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణ
  • రాష్ట్రం పరువు తీసేలా రేవంత్ రెడ్డి భాష, వ్యవహార శైలి ఉందన్న హరీశ్ రావు
Harish Rao blames Revanth Reddy for real estate business

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని, అసలు రాష్ట్రం దివాలా తీసిందని ఏ సీఎం అయినా చెబుతారా? అలా చెబితే ఎలా? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాదిమంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోందని... దీనిని ఎందుకు ఖండించడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశముందని, అప్పుడు బీఆర్ఎస్ కీలకంగా మారుతుందన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ చెరో ఎనిమిది సీట్లలో గెలిచేలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. మోదీ ఆశీర్వాదం కావాలని కోరిన రేవంత్ రెడ్డి ఎనిమిది సీట్లలో బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విభజన జరిగి పదేళ్లవుతుందని, ఈ జులై నాటికి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కాలపరిమితి పూర్తవుతుందన్నారు. మరోసారి ఉమ్మడి రాజధానిగా చేయాలని సమైక్యవాదులు అంటున్నారని వ్యాఖ్యానించారు. మళ్లీ ఈ డిమాండ్ ఊపందుకుందన్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రామూలాలు ఉన్నాయన్నారు. పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే ఉమ్మడి రాజధాని కుట్రను అడ్డుకుంటారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రం పరువు తీసేలా రేవంత్ రెడ్డి భాష, వ్యవహార శైలి ఉందని విమర్శించారు. రేవంత్‌ భాషను తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌ పట్ల ఆయన భాషను ప్రజలు ఆమోదించడం లేదని, యువతకు, భవిష్యత్తు తరానికి ఏం సందేశం ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. రోజూ ప్రజల్ని కలుస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఒక్కసారి మాత్రమే కలిశారన్నారు. పార్టీ మారితే అనర్హత వేటు అని కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పిందని, కానీ బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అక్రమ కేసులో అరెస్ట్ చేశారన్నారు.

కాంగ్రెస్ చెప్పినట్టు రాష్ట్రంలో మార్పు మొదలైందని... ఈ ప్రభుత్వం వచ్చాక మళ్లీ తాగునీటి కొరత వచ్చిందని, ప్రజలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయని, విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారని, కాంగ్రెస్ 15 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదన్నారు. బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుబంధు రాలేదంటే చెప్పుతో కొడతామని ఓ మంత్రి అన్నారని... కానీ స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకే రాలేదన్నారు.

  • Loading...

More Telugu News