Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజలకు, తనకు మధ్య బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించింది: తమిళిసై సౌందరరాజన్

  • తెలంగాణలో తాను ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకురావడానికి ప్రయత్నించానన్న గవర్నర్
  • నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదని విమర్శ
  • రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా

తెలంగాణ ప్రజలకు, తనకు మధ్య బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించిందని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సంగారెడ్డిలో విశిష్ట సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పెట్టడానికి తాను ప్రయత్నించానన్నారు. కానీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ప్రజలకు అందించాలనేదే తన లక్ష్యమని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. అంతేకాదు, అసలు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. కాగా, తమిళిసై సౌందరరాజన్ లోక్ సభ ఎన్నికల ముందు వరకు తెలంగాణ గవర్నర్‌గా పని చేశారు. ఇటీవల ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత తమిళనాడులో లోక్ సభ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు .

  • Loading...

More Telugu News