CPI Narayana: అరాచకాలకు పాల్పడుతున్నా ఎంఐఎంపై కేసులు లేనిది అందుకే: సీపీఐ నారాయణ

  • కేరళలో విజయన్‌ను రేవంత్ విమర్శించకుండా ఉండాల్సిందన్న నారాయణ
  • ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని స్పష్టీకరణ
  • ఇండియా కూటమిలో మిత్రులమే కానీ, కేరళలో ప్రత్యర్థులమన్న సీపీఐ అగ్రనేత
CPI Narayana Says Modi And MIM Are Close Friends

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎంఐఎంలది జిగిరి దోస్తానా అని, అందుకే ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా ఎంఐఎంపై ఒక్క కేసూ లేదని సీపీఐ నారాయణ ఆరోపించారు. పాతబస్తీలో వ్యవస్థలు పనిచేయవని పేర్కొన్నారు. నిన్న ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కేరళ ప్రచారంలో సీఎం పినరయి విజయన్‌పై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరి కాదని పేర్కొన్నారు. లెఫ్ట్‌ను విమర్శించేటప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాలి తప్పితే వ్యక్తిగత విషయాల ప్రస్తావన సరికాదని హితవు పలికారు.

జాతీయస్థాయిలో ఇండియా కూటమిని బలోపేతం చేస్తున్నామన్న నారాయణ.. ఆ రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి పొత్తులు, పోటీ పెట్టుకుంటున్నట్టు తెలిపారు. వయనాడ్‌లో రాహుల్‌గాంధీ పోటీపై మాట్లాడుతూ అక్కడ సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతోనే విడివిడిగా పోటీచేస్తున్నట్టు తెలిపారు. ఇండియా కూటమిలో తాము మిత్రులమే అయినా, కేరళలో మాత్రం కాంగ్రెస్‌కు తాము ప్రత్యర్థులమేనని పేర్కొన్నారు. తెలంగాణలో పోటీ నుంచి తప్పుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. సీట్లు అడిగినా కాంగ్రెస్ ఇవ్వలేదని, అంతమాత్రాన బీజేపీ, బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వలేమని నారాయణ స్పష్టం చేశారు.

More Telugu News