Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

  • రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షా ఫేక్ వీడియో వైరల్‌గా మారిందని బీజేపీ ఫిర్యాదు
  • కాంగ్రెస్ నేతలే ఆ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని ఫిర్యాదు
  • పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
Delhi Police notices to CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు గాంధీ భవన్‌కు వెళ్లారు. మే 1న ఫోన్ తీసుకొని విచారణకు రావాలని పోలీసులు తెలిపారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా చెప్పినట్లుగా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోందని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. వీడియో షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ట్విట్టర్ హ్యాండిల్స్‌కు నోటీసులు జారీ చేశారు.

ఈ ఫేక్ వీడియోను ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. ఈ ఫేక్ వీడియోలు ఝార్ఖండ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

More Telugu News