Chandrababu: ముస్లిం రిజర్వేషన్లపై జగన్ విషప్రచారం చేస్తున్నాడు... ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయం: చంద్రబాబు

  • కోడుమూరు నియోజకవర్గం గూడూరులో ప్రజాగళం
  • హాజరైన చంద్రబాబు
  • 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల కోసం పోరాడిన పార్టీ టీడీపీ అని వెల్లడి
  • సైకో ప్రచారాన్ని నమ్మవద్దు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు 
Chandrababu talks about Muslim reservations

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఇవాళ గూడూరులో జన ప్రభంజనం కనిపిస్తోందని, ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాబు కనిపిస్తోందని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. 

ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోనూ జన స్పందన చూస్తున్నా... మనకు ఇక తిరుగులేదు అని పేర్కొన్నారు. అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని, జనాభా దామాషా ప్రకారమే టికెట్లు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. సైకో జగన్ ఎప్పుడూ మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తి అని విమర్శించారు. 

నేను చెప్పింది చేస్తాను... ఒకవేళ చేయలేనిదైతే ఆ విషయం కూడా చెబుతాను... నాది ఒకటే ఆలోచన... 40 ఏళ్లు నన్ను ఆదరించారు... నేను మళ్లీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు ముందుకు వచ్చాను అని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో తీవ్రంగా నష్టం జరగడం వల్లే కూటమి కట్టామని స్పష్టం చేశారు. 

"1995 నుంచి టీడీపీ ఎన్డీయేలో ఉంది. 2014 నుంచి 2019 వరకు ఎన్డీయేలో ఉంది. ఇక్కడుండే ముస్లిం సోదరులకు ఎవరికైనా అన్యాయం జరిగిందా? ఎప్పుడైనా అన్యాయం చేశామా? హైదరాబాదులో ముస్లిం యూనివర్సిటీ తెచ్చింది నేనే. అది కూడా వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో. 

ఆ తర్వాత హజ్ హౌస్ కట్టి హైదరాబాద్ నుంచి నేరుగా మక్కా పంపే ఏర్పాట్లు చేశాం. 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా ప్రారంభించింది మేమే. విభజన జరిగిన తర్వాత దుకాన్ ఔర్ మకాన్ పథకం ఇచ్చాం. దుల్హన్ పథకం కింద 36 వేల మంది ముస్లిం ఆడబిడ్డలకు రూ.136 కోట్ల నిధులతో పెళ్లిళ్లు జరిపించాం. 

రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమామ్ లు, మౌజన్ లకు పారితోషికం ఇచ్చాం. ముస్లింలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చాం, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాం. 2014లో ముస్లిం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో ముస్లింల తరఫున న్యాయవాదులను ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం. 

ఇప్పుడు సైకో జగన్ మాట్లాడుతున్నాడు... 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని ఇంటింటికీ వచ్చి విషప్రచారం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రిజర్వేషన్లు తీసేయం, జగన్ చేస్తున్నది అబద్ధపు ప్రచారం. 

ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా... సుప్రీంకోర్టులో ముస్లింల కోసం ఎంతమంది న్యాయవాదులైనా పెట్టి రిజర్వేషన్లను రక్షించుకునే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇదే కాదు, మసీదులకు ఆర్థికసాయం చేసిన పార్టీ తెలుగుదేశం. మసీదులపై దాడులు చేసిన పార్టీ వైసీపీ... మసీదులకు రక్షణగా నిలిచిన పార్టీ టీడీపీ" అని చంద్రబాబు వివరించారు.

More Telugu News