TDP: వైఎస్సార్​ సీపీ హయాంలో ముస్లింలపై దౌర్జన్యాలు.. చంద్రబాబు ఫైర్​

  • నెల్లూరులో ముస్లింలతో సమావేశమైన టీడీపీ అధినేత
  • టీడీపీ హయాంలోనే ముస్లింలకు న్యాయమని వ్యాఖ్య
  • దోపిడీలు, మోసం చేసేవారికి గుణపాఠం చెప్పాలని పిలుపు
chandrababu comments on ysrcp government

వైఎస్సార్ సీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు తగిన న్యాయం జరిగిందని చెప్పారు. ఆదివారం నెల్లూరులోని షాదీ మంజిల్‌ లో ముస్లింలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

దోపిడీ చేసేవారికి గుణపాఠమే..
పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. స్వార్థం కోసం దోపిడీలు, మోసాలకు పాల్పడే వారికి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు.

హైదరాబాద్‌ లో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. హజ్‌ హౌస్‌ నిర్మించి ముస్లిం సోదరులను మక్కా పంపించామని చంద్రబాబు చెప్పారు. కడప, విజయవాడలలో కూడా హజ్‌ హౌస్‌ లు నిర్మించామని వివరించారు. రూ.8 కోట్లు ఖర్చు పెట్టి షాదీ మంజిల్‌ కట్టించామని తెలిపారు. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ముస్లింల కోసం ఒక్క భవనమైనా నిర్మించారా? అని ప్రశ్నించారు.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుందని ఆరోపించారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు అడ్డగోలుగా పెరిగిపోయాయని చెప్పారు. టీడీపీ హయాంలో రాష్ట్ర స్థాయిలో రొట్టెల పండుగను నిర్వహించామని.. అబ్దుల్‌ కలాం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.

More Telugu News